ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్య యాదవ్
కొడంగల్ : గొల్ల కురుమ యాదవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ.. వారి అభివృద్ధికి ప్రత్యేకంగా తోడ్పడుతున్నట్లు కొడంగల్, షాద్నగర్ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం యాదవుల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే సదర్ ఉత్సవ వేడుకను గొల్ల, కురుమ యాదవులు ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని గాడిభావి శివాలయం నుంచి స్థానిక అంబేద్కర్ కూడలి వరకు డీజే సౌండ్స్ తీన్మార్ పాటల మీద నృత్యాలు చేస్తూ దున్నపోతులతో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ ఉత్సవాలు హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఘనంగా జరిగేవని, ప్రస్తుత రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సదర్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ గొల్ల కురుమ యాదవులు ఐక్యతను చాటుకుంటున్నారన్నారు. గొర్రెపిల్లల యూనిట్తో గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నట్లు తెలిపారు.
దేశంలోని కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాల వారికి అన్నింటా సౌకర్యవంతంగా ఉండే పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. సదర్ ఉత్సవ ఊరేగింపులో గొల్ల కరుమ యాదవులు ఆనందోత్సవాల నడుమ నృత్యాలను చేస్తూ దున్నపోతులతో విన్యాసాలను చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, సదర్ ఉత్సవ నిర్వాహకులు మధసూదన్యాదవ్, దాసప్పయాదవ్, డాక్టర్ రవీంద్రయాదవ్, వెంకటేష్, రామకృష్ణయాదవ్, శ్రీమన్రావుయాదవ్, రాల్ యాదవ్ పాల్గొన్నారు.