పరిగి : వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు పోస్టర్, బుక్లెట్ను శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం, యాసంగి రెండు సీజన్లో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, వరి కొనుగోలుకు మార్కెట్ ఇబ్బందులు తలెత్తడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వరిని వరుసగా పండించడం వల్ల పంటల వైవిద్యం దెబ్బ తింటుందని తెలిపారు. జిల్లాలో పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందన్నారు.
వివిధ రకాల పప్పుజాతి పంటలు, కూరగాయలు, నూనెగింజల పంటలు సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పెసర, జొన్న, వేరుశనగ, శనగ, నువ్వులు, ఆవాలు, కుసుమ, ఆముదం, మినుములు, పొద్దు తిరుగుడు పంటలు పండించి రైతులు లాభాలు ఆర్జించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ పాల్గొన్నారు.