ధారూరు, డిసెంబర్ 1 : గ్రామ సమీపంలోని సర్ఫన్పల్లి ప్రాజెక్ట్ కాలువలకు మరమ్మతులు చేపట్టి, పంటపొలాలకు సాగు నీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్ఫన్పల్లి గ్రామంలో మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించి, గ్రామంలో ఉన్న సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, కలుపు మొక్కలను తొలగించి, మురుగు కాలువలను శుభ్రం చేయించి స్వచ్ఛ గ్రామంగా మార్చాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ సర్ఫన్పల్లి ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు నీరందించే కాలువలు సరైన పద్ధతిలో లేవని ప్రజలు తెలుపగా వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, కలుపు మొక్కలు వెంటనే తొలగిస్తూ, శానిటేషన్ చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు.
పారిశుధ్య పనులు ప్రతి దినం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని 8వ వార్డులో మిషన్ భగిరథ నీటి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరగా ప్రతి కుటుంబానికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచి నీటి ట్యాంకులను ప్రతి నెలా 1, 11, 21 తేదీల్లో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
పశు వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పశువులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎంపీడీవో సత్యయ్య, ఎంపీవో నాగరాజు, సర్పంచ్ సాకిరబేగం ఫకీర్ఖాన్, పంచాయతీ కార్యదర్శి విజయరాణి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కమాల్రెడ్డి, నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
రామమందిరానికి మూడేండ్లు మినహాయింపు
ధారూరు, డిసెంబర్ 1 : తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి వికారాబాద్ పట్టణంలోని రామమందిరం దేవాలయాన్ని మూడు సంవత్సరాలు మినహాయింపును ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కృషితో ఈ మినహాయింపు ఇచ్చిందని రామాలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి వికారాబాద్ రామమందిరం మూడు సంవత్సరాలు (13-10-2022 నుంచి 12-10-2025)వరకు మినహాయింపునిస్తూ జీవో జారీ చేసిందన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ధారూరు, డిసెంబర్ 1 : ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరై మాట్లాడారు. అనంతరం ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తున్న వారికి, వైద్య వృత్తిలో మంచి సేవలు అందించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏఎస్ఎంలు, ఆశవర్కర్లు, నాయకులు పాల్గొన్నారు.