మోమిన్పేట : గ్రామాల్లో నేలకొన్న సమస్యల పరిష్కారం కోసం మీతో నేను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రాంనాథ్గుడుపల్లి, గోవిందపురం గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు కరెంట్, మిషన్ భగీరథ పైపుల లీకేజీ, నూతన ట్యాంక్ అవసరం గురించి, రెవెన్యూ, సమస్యలు, గోవిందపురం గ్రామ రైతులు పొలాలకు వెళ్లేందుకు పెద్దవాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు, బ్యాంక్ లావాదేవీలకు వెల్చాల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాంనాథ్గుడుపల్లి గ్రామం రైతుల పొలాల్లో వెళాడుతున్న విద్యుత్ తీగాలను సరి చేసి, కరెంట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఏఈకి సూచించారు. రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. గ్రామంలో మీషన్ భగీరథ నీటి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు వెంటనే చేపట్టి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. గోవిందపురం రైతులకు మోమిన్పేట బ్రాంచ్లో బ్యాంక్లో పాడి పశువులకు మండల కేంద్రంలో సేవలందించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుమార్, మండల అధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీటీసీ కృష్ణ రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.