పరిగి : ఈ నెలాఖరు వరకు జిల్లాలో వందశాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో వైద్యాధికారులతో వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు 30 వేల డోసులు చొప్పున వ్యాక్సినేషన్ చేసి లక్ష్యం పూర్తి చేయాలన్నారు. 2వ డోసు వ్యాక్సినేషన్ జిల్లాలో 30శాతం కావడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా ప్రతి ఒక్కరు నిర్ధేశించిన లక్ష్యాన్ని ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన డ్రోన్ ద్వారా మందుల సరఫరా ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర మందులను అతి వేగంగా చేరవేసేందుకు దేశంలోనే మొదటిసారి వికారాబాద్ జిల్లాలో డ్రోన్లను వినియోగించడం జరుగుతుందని తెలిపారు. సిద్దులూరు పిహెచ్సి నుంచి శాంపిల్స్ను వికారాబాద్కు డ్రోన్ ద్వారా పంపించగా, అదే డ్రోన్ ద్వారా సిద్దులూరుకు వ్యాక్సిన్లు, మదులను పది నిముషాల్లో పంపించడం జరిగిందన్నారు. డ్రోన్ ద్వారా జిల్లాలో 50 కిలో మీటర్లు పరిధిలో అత్యవసర సేవలు వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి తుకారాం, డిప్యూటీ డిఎంఅండ్హెచ్వో జీవరాజ్, డాక్టర్ అరవింద్, మండలాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.