పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. గణతంత్ర దినోత్సవం రోజున 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమాకం చేపట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నియమితులయ్యారు. మెతుకు ఆనంద్ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచుకున్నారు. డాక్టర్ మెతుకు ఆనంద్ ‘మీతో నేను’ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటించి, అక్కడి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. రోజు అనేక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటున్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి వరించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం ఆదేశాలతో పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుకువెళ్లడం ద్వారా పార్టీ మరింత పటిష్టవంతంగా తయారయ్యేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు.