పరిగి/షాబాద్, మే 16 : పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. మే 23 నుంచి జూన్ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించలేదని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రం తెరిచే గదిలో సీసీ కెమెరా పెట్టాలని, అదేవిధంగా పరీక్ష కేంద్రం బయట సైతం సీసీ కెమెరా పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, క్యాలికులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్లను ఇన్విజిలెటర్లుకానీ, విద్యార్థులుకానీ తీసుకువెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నాపత్రాలను సమీప పోలీస్స్టేషన్లకు తరలించి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. ప్రహరీ లేని పరీక్ష కేంద్రం, ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసే కేంద్రాల్లో అదనంగా పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా బస్ డిపో మేనేజర్లతో మాట్లాడి రూట్ల వారీగా ప్రత్యేక బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ నిఖిల అధికారులతో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షిస్తూ.. జిల్లా పరిధిలో పరీక్షలకు 14,440 మంది విద్యార్థులు హాజరవుతారని, వారికి 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతోపాటు వైద్య సిబ్బంది, మంచినీటి సదుపాయం, పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరపరా, పరీక్షా సమయానికి తగినట్లుగా ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, అడిషనల్ ఎస్పీ రషీద్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి, జిల్లా వైద్యాధికారి తుకారాం, ఆర్టీసీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో పరీక్షా కేంద్రాలు 282 ఉన్నాయని, 31 పోలీస్స్టేషన్లలో ప్రశ్నాపత్రాలు భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. 282 పరీక్షా కేంద్రాల్లో 47,560 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు ఏఎన్ఎంలు, ఆశావర్కర్లను అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమలు, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు చేపడుతామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, పోలీసుశాఖ అధికారులున్నారు.