తాండూరు, జూలై 21: త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను బుధవారం తాండూరు నియోజకవర్గంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని ముస్లింలు ఈద్గా, మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాండూరు పట్టణ శివారులోని చెన్గేశ్పూరు మార్గంలో ఉన్న ఈద్గా మైదానానికి వందలాది సంఖ్యలో ముస్లింలు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ బోధనలను, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ త్యాగ గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రమేశ్తో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేసిందన్నారు. తాండూరు ఈద్గా అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు తమ వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమున్న సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఖాంజాపూర్ వద్ద ఏర్పాటు చేసిన స్థలంలో అన్ని వసతులతో ప్రార్థన కోసం నిర్మాణం చేపట్టేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు.
పరిగిలో..
పరిగి, జూలై 21 : పరిగిలో బక్రీద్ పండుగను ముస్లింలు పట్టణంలోని మసీద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీ.రాంమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూడూరు మండలం కంకల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పూడూరు ఎంపీపీ మల్లేశం, జడ్పీ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, కౌన్సిలర్ మునీర్, టీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్ పాల్గొన్నారు.
బషీరాబాద్ మండల కేంద్రంలో..
బషీరాబాద్, జూలై 21 : మండల కేంద్రంలో మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి ముస్లిం మత పెద్దలతో కలిసి మసీద్ వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బషీర్, ఏఎస్సై నర్సింహులుగౌడ్ ఉన్నారు.
పెద్దేముల్లో పోలీసుల బందోబస్త్
పెద్దేముల్, జూలై 21 : మండల పరిధిలోని కందనెల్లి, మంబాపూర్, రేగొండి, మారేపల్లి, పెద్దేముల్, గాజీపూర్, తట్టేపల్లి, గొట్లపల్లి, ఇందూరు, అడికిచెర్ల, బండమీదిపల్లి, నాగులపల్లి తదితర గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించారు. తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి ఆదేశాల మేరకు పెద్దేముల్ ఎస్సై గఫార్ ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.