మోమిన్పేట : రైతులకు మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. ఆదివారం మోమిన్పేట మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాలులో పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రాప్లోన్స్, ఎల్టీ లోన్స్ రైతులకు అందించడం కోసం పద్ధతులను సరళీకృతం చేస్తున్నామన్నారు. సొసైటీ బ్యాంకులో జరిగే అన్ని లావాదేవీలు సభ్యులందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందు కోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. చిరు వ్యాపారస్తులకు సొసైటీ బ్యాంక్ ద్వారా లోన్ కల్పించడం కోసం కొత్త పథకాలు మొదలు పెడుతున్నామన్నారు.
సొసైటీ సభ్యులు అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి నెలలో తమ వడ్డీ డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రాథమిక సహాకార సంఘం నుంచి వచ్చే సదుపాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంక్ సిబ్బంది రైతులకు సకాలంలో సహాయ సహాకారాలందిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు విష్ణువర్థన్రెడ్డి, అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, సొసైటీ డైరెక్టర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.