వికారాబాద్, జనవరి 26 : పోలీస్ వ్యవస్థకు ఏఆర్ ఉద్యోగులు వెన్నెముఖలాంటి వారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఏఆర్ సిబ్బంది, అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ మనం చేసే ఉద్యోగం చిన్నా, పెద్ద తేడా ఉండదని, మనం చేసే పనే మనకు గుర్తింపునిస్తుందన్నారు. కష్టపడి పని చేసేవారికి అధికారులు, ప్రజలు అందరూ తగిన గుర్తింపు ఇస్తాని తెలిపారు. ఏఆర్ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఉన్నతాధికారులను కలవాలని, అక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా తమ దృష్టికి తీసుకరావాలన్నారు.
జిల్లా సిబ్బంది సమస్యల ఫిర్యాదు కోసం వారంలో ఒక రోజు గ్రీవీన్స్డే (ఫిర్యాదుల దినంతో పాటు డీపీవోలో కంప్లెంట్ బాక్స్ ఏర్పాటు చేస్తామని వివరించారు. మనమందరం ఒకరికోకరం సహాయం చేసుకుంటూ ఉద్యోగులు స్నేహ పూర్వక వాతావరణంలో పని చేయాలన్నారు. ఏఆర్ సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండాలని, అందుకోసం నెలలో కొన్ని రోజులు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. పని ఒత్తిడి తగ్గించడానికి క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తామని, ఆటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి పని ఒత్తిడి తగ్గించవచ్చన్నారు. సంవత్సరం ఒకసారి క్రీడల పోటీలు నిర్వహించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతలకు సహకరిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు నాగేశ్వర్రావు, శ్రీనివాస్, ఆర్ఐలు భారత్భూషణ్, అచ్చుతరావు, రత్నం, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.