వికారాబాద్ : సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, కోవిడ్ సమయంలో పోలీస్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు ఫార్వర్డ్ చేసిన, షేర్ చేసిన, పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇతర మత విశ్వాసాలపై వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసిన, మహిళలపై అసత్య పదజాలం ఉపయోగించిన వారిని శిక్షిస్తామన్నారు. మహిళలు, బాల బాలికల ఫొటోలను మార్పింగ్ చేసి పోస్ట్ చేసినా, వ్యక్తిగతంగా గాని, సామాజికంగా గాని ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. జిల్లా ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీస్ అధికారులు దృష్టికి తీసుకోవాలని తెలిపారు.
కొవిడ్ ఫ్రీ పోలీస్ స్టేషన్ లే లక్ష్యం..
కొవిడ్ వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా పెరుగుతున్న సమయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు జాగ్రత్తలు పాటిస్తూ సిబ్బందిని ప్రజలను వైరస్ నుంచి కాపాడాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కొవిడ్ ఫ్రీ పోలీస్ స్టేషన్లుగా మార్చాలని, పోలీస్ అధికారులు అందరూ పని చేసే చోట మాస్క్లు, శానిటైజర్లు వాడి భౌతిక దూరం పాటించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు అందరూ కొవిడ్ టీకాలు తీసుకునేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల కొరకు శానిటైజర్లు ఏర్పాటు చేసి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.