రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని చరికొండ గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారిని శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
– కడ్తాల్, ఫిబ్రవరి 25
పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్
కడ్తాల్, ఫిబ్రవరి 25 : మండల పరిధిలోని చరికొండలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం వేణుగోపాలస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడాకులు, కొబ్బరి, అరటి తోరణాలు, వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం స్వామి వారికి శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
వివిధ రంగుల పూలమాలలతో వేణుగోపాలస్వామి, రుక్మిణీసత్యభామ అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. స్వామి వారికి సమర్పించే పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. అనంతరం ఆలయ వేద పండితులు చక్రవర్తి శ్రీనివాసాచార్యులు, కృష్ణామాచార్యులు, కిరణాచార్యులు, వేణుగోపాలచార్యుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల కరతాళ ధ్వనుల మధ్య, ముత్యాల తలంబ్రాలతో స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్లు భారతమ్మ, లోకేశ్నాయక్, యాదయ్య, ఎంపీటీసీ రాములుగౌడ్, ఉప సర్పంచ్ నరేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, ఈవో మోహన్రావు, నాయకులు నర్సింహాగౌడ్, లక్ష్మయ్యగౌడ్, భీష్మాచారి, యాదయ్య, గోపాల్, జంగయ్య, రాజీవ్, బాలకృష్ణగౌడ్, లింగం, సత్యశీలారెడ్డి, ఈశ్వర్, వెంకటయ్య, కరుణాకార్, దుర్గయ్య, కృష్ణయ్య, రమేశ్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.