సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (గురుకుల) నిజామాబాద్ పీజీ విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే.. సాహితీ కుసుమాలను వెదజల్లుతున్నారు. ఒకరు స్వీయ చరిత్ర రాస్తే.. మరొకరు కవితాత్మకంగా భావాలు వ్యక్తపరుస్తున్నారు. ఇంకొకరు ఆంగ్లంలో.. మరో విద్యార్థి హిందీలో, ప్రాంతీయ మాండలికంలో, 100 చిత్రాలు గీసి, 100 పద్యాలు రాశారు. కవితలు, నవలలు, ఆత్మకథలు, ఆర్ట్, క్రైం, ఏదైనా… 17 మంది గురుకుల విద్యార్థులు నచ్చిన రచనలు చేసి శభాష్ అనిపించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీ రోనాల్డ్రోస్ అనుమతితో ఆంగ్ల అధ్యాపకురాలు సంధ్యాదీప్తి ప్రోత్సాహంతో 100 మంది రచయితలను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆంగ్ల విభాగం లెక్చరర్ పద్మమ్మ తెలిపారు. అంతేకాదు టెలిస్కోప్ పేరుతో ఆరు నెలలకోసారి తీసుకొస్తున్న సంచికలో వారి విశేషాలను పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో ఏర్పాటు చేసిన 35వ హైదరాబాద్ పుస్తక వేడుకలో ప్రత్యేక స్టాల్(నంబర్ 38)ను ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెం దిన రేణుక తన రచనలతో పాఠకులను కవితా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. పనిలో ఉండే సౌందర్యాన్ని తన కవిత్వంలో వివరిస్తుంది. 2020లో ‘ప్రస పిచ్చుకలు’ పేరుతో తన మొదటి రచన ప్రచురించారు. ప్రస్తుతం మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో జువాలజీ మాస్టర్స్ చదువుతున్న రేణుక రచనే కాదు డ్యాన్స్, క్రాఫ్ట్ వర్క్, డిజైనింగ్, పెయింటింగ్లోనూ రాణిస్తున్నది.
– రచయిత్రి రేణుక ఈదొల్ల, పాలమూరు యూనివర్సిటీ
ప్రస్తుతం నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న తేజస్విని తెలుగు పద్యంలో లోతైన విశ్లేషణ చేస్తున్నది. ఆమె మదిలో నదిలా పుస్తకంలో కవితా అన్వేషణ పరంపరలో మానవ స్వభావంలోని అనేక ఆలోచనలను సృ్పశిస్తోంది. మునిగిపోతున్న ఆత్మను రక్షించుకోవాలని సమాజాన్ని మేల్కొల్పుతున్నది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం తనకు ప్రేరణగా నిలిచిందని తేజస్విని చెబుతుంది.
– రచయిత్రి తేజస్విని, టీఎస్డబ్ల్యూఆర్డీసీ, నిజామాబాద్
కామారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన సదా నిజామాబాద్ టీఎస్డబ్ల్యూఆర్డీసీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. ఆంగ్లంలో మంచి పట్టు ఉన్న సదా తన రచనల్లో మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. మానవ జీవితంలోని దు:ఖం, నమ్మకం, విశ్వాసం, అంగీకారం, తిరస్కరణ లాంటి అనేక అంశాలపై తన కవిత్వాన్ని ఎక్కుపెట్టారు. అలాగే తెలుగులో ‘అనగనగా ఒక భవనం’ అనే పుస్తకాన్ని కూడా రచించింది.
– రచయిత్రి సదా
బోధన్ మండలం ఊట్పల్లికి చెందిన అఖిల, అదే మండలం అమ్డాపూర్కు చెందిన సుప్రజ ఇద్దరూ ఎమ్మెస్సీ చివరి సంవత్సరం చదువుతున్నారు. మునుచూపు ముత్యాలు పేరుతో వీరిద్దరూ ఆటవెలది శైలిలో పద్య రచన చేసి పుస్తకాన్ని వెలువరించారు. పద్యాన్ని ఇష్టపడే వారికి ఇదొక గొప్ప బహుమానం. 108 పద్యాలతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం మానవ జీవితంలో అనేక అంశాలపై పాఠకులను మెప్పిస్తుంది.
– రచయిత్రులు అఖిల, సుప్రజ
బోర్గాం గ్రామానికి చెందిన మాధురి రచనల్లో భారతీయ సన్నివేశాలు ప్రతిబింబిస్తాయి. ప్రతికథను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దగలిగారు. మానవ మనస్తత్వశాస్త్రం గూర్చి పలు అంశాలను విశ్లేషించారు. తన రచనకు తల్లిదండ్రులు సువర్ణ-రాజు ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నది.
– రచయిత్రి మాధురి, నిజామాబాద్
నందిని రచనల్లో తెలంగాణ పదాలు, యాస, భాష, నుడికారాలు, మాండలికం, ఉప మాండలికం ప్రతిబింబిస్తాయి. విషాదం, ఓదార్పుతో కూడిన అంశాలు పుస్తకంలో ఉన్నాయి. రచనతోపాటు నృత్యం, నటన అంటే తనకు చాలా ఇష్టం. నిరంతరం ఆలోచిస్తూ.. మనసులోకి వచ్చిన ఆలోచనలన్నీ పేపర్పైకి చేర్చి రచనల్లో ముందుకు సాగుతున్నట్లు నందిని తెలిపారు.
– రచయిత్రి నందిని, కామారెడ్డి
గౌలిదొడ్డికి చెందిన శ్రావణ్ 100 కవితలతో ఫ్లయింగ్ రెయిన్బో పుస్తకం వెలువరించారు. ఇందులో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని అర్థం చేసుకోవచ్చు. కవిత్వంతో పాటు ఛందస్సు, పదాల మధ్య సారూప్యతతో ఇమిడి ఉన్నది. పదకూర్పులో ప్రాస వినోదం కనబడుతుంది. రచయిత వ్యక్తీకరణ పదాలను మించిపోయిందని చెప్పాలి.
– రచయిత శ్రావణ్, గౌలిదొడ్డి
నిజామాబాద్ టీఎస్డబ్ల్యూఆర్డీసీలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్న గంగోత్రి రామగిరి స్వగ్రామం జలాల్పూర్. గంగోత్రి హార్రర్ ఫిక్షన్తో రాసిన పుస్తకం ఇది. ఇందులో ఉత్కంఠభరితమైన అంశాలు పాఠకులను ఆకట్టుకుంటాయి. గంగోత్రికి రచనే కాదు నాట్యంపై కూడా చాలా మక్కువ. దేశ వ్యాప్తంగా అనేక జాతీయస్థాయి నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నది.
– రచయిత్రి గంగోత్రి రామగిరి, టీఎస్డబ్ల్యూఆర్డీసీ, నిజామాబాద్
చిన్ని తల్లి కోరిక స్వీయ చరిత్రను మోర్తాడ్ మండలం వడ్డియత్ గ్రామానికి చెందిన సిరిగిరి శ్రీజ రచించారు. ఉమ్మడి కుటుంబంలోని మూలలు చెబుతూ.. రక్త సంబంధాల అనుబంధాలను ప్రతిబింబిస్తూ… పల్లె జీవన చిత్రాన్ని విడమర్చి చెబుతున్నది. ప్రస్తుతం నిజామాబాద్లో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీజ తన రచనకు తల్లి దండ్రులు శైలజ, శ్రీనివాస్ ఎంతో తోడ్పడ్డారని చెబుతుంది.
– రచయిత్రి సిరిగిరి శ్రీజ, టీఎస్డబ్ల్యూఆర్డీసీ, నిజామాబాద్
‘మట్టిలో మాణిక్యం’ ఆత్మకథను లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన లావణ్య-గంగాధర్ల కుమార్తె సుస్మిత అంకం రాశారు. ఎంతో సృజనాత్మకత, ఆధ్యాత్మికత విషయాలను తెలియజేస్తూ.. మనుషులపై సానుభూతిని, ఆప్యాయతను గుర్తు చేస్తుంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుస్మిత భవిష్యత్లో మంచి రచయిత్రిగా నిలదొక్కుకుంటానని చెబుతోంది.
– రచయిత్రి సుస్మిత అంకం, నిజామాబాద్
విశ్వ ప్రపంచం, మాయాజాలం, స్టార్డస్ట్ కథల నుంచి ప్రేరణ పొంది ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత కీర్తి తెలిపింది. ఇందులో బాల్య స్మృతుల లోతైన జ్ఞాపకాలతో 15 అద్భుతమైన కథలు ఉంటాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శక్కర్గా గ్రామానికి చెందిన కీర్తి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో హిందీ విభాగంలో పీజీ చేస్తున్నది. ఈ పుస్తక రచనకు తన తల్లిదండ్రులు బస్వరాజ్-నిర్మల స్ఫూర్తి అని తెలిపింది.
– రచయిత కీర్తి బొగ్డేవార్, ఓయూ హిందీ విభాగం
బిచ్కుంద మండలం బండరేంజల్ గ్రామానికి చెందిన స్వాతిక 2021లో ‘నీలి స్వప్నాలు’ రచించారు. ఇందులో 100 చిత్రాలతో 100 కవితలు ఉంటాయి. అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తీకరణలతో రచయిత్రి పాఠకులను ఆకట్టుకున్నది. స్వాతిక ప్రస్తుతం డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఎంఏ తెలుగు సాహిత్యం చదువుతున్నారు.