ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 27 : నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు అత్యధికంగా ఉన్నాయి. ఈ కళాశాలలకు ప్రతిరోజూ ఉదయం నగరం నుంచి పెద్దఎత్తున ఇంజినీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులకు బస్సు ప్రయాణం కత్తిమీద సాములా మారింది.
ఫుట్బోర్డులపైనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నది. దీంతో పలువురు విద్యార్థులు ఈ సమస్యపై నేరుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన ముందుగా ఇబ్రహీంపట్నం వరకు సాగర్ రహదారిపై అదనంగా 30 ట్రిప్పులను నడపాలని ఆదేశించారు. వీటిలో ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 15 ట్రిప్పులు, బీఎన్రెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం మరో 15 ట్రిప్పులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడపాలని ఆదేశించారు. ఈమేరకు నేటి నుంచి ఆర్టీసీ అధికారులు ట్రయల్ రన్గా ప్రారంభించారు. దీనిపై సర్వే కూడా నిర్వహిస్తున్నారు. సర్వే ఆధారంగా ఎన్ని ట్రిప్పులు అవసరమో గుర్తించి ఎండీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు 160 ట్రిప్పులు నడుపుతున్నారు. వీటిలో అత్యధికంగా సికింద్రాబాద్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. దీనికితోడు మిధాని, సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్ తదితర డిపోలకు చెందిన బస్సులు కూడా నడుపుతున్నారు. అయినప్పటికీ బస్సులు సరిపోకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
మహిళల కోసం ప్రత్యేక బస్సులు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థినుల కోసం అదనపు బస్సులు నడపాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. నగరంలోని ఏయే ప్రాంతాల నుంచి విద్యార్థినులు ఎక్కువగా వెళుతున్నారనే దానిపై సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నుంచి నగరానికి ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులంటూ లేవు. దీంతో అమ్మాయిలు కూడా ఫుట్బోర్డు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక నుంచి ఫుట్బోర్డు ప్రయాణాలకు స్వస్తి
– అశోక్రాజు, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీఎం
నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం ఇంజినీరింగ్ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు ఇక నుంచి ఫుట్బోర్డు ప్రయాణం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. నగరం నుంచి ఇబ్రహీంపట్నంవైపు వచ్చే అన్ని ప్రధాన రోడ్లల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిలోని బొంగుళూరు, మంగల్పల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్గేటు వరకు ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్న ప్రాంతాలకు నడుపుతున్న బస్సులకు అదనంగా మరిన్ని బస్సులను నేటి నుంచి ప్రారంభించాం.