ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో ఒకేరోజు కమిషనర్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన మున్సిపల్ కమిషనర్ల బదిలీలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి వాణిని కమిషనర్గా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమె బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం కాగానే, శుక్రవారం సత్యనారాయణరెడ్డి అనే అధికారిని ఇక్కడ కమిషనర్గా నియమించారు. దీంతో వాణి కమిషనర్గా రాకముందే శుక్రవారం సత్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఒకే రోజులో కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, ఇబ్రహీంపట్నం సీఐగా వచ్చిన ఆంజనేయులు వారం రోజులు తిరుగకుండానే బదిలీ అయ్యారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బదిలీల పరంపర కొనసాగుతున్నది.