రంగారెడ్డి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర దినోత్సవానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలతో పాటు ప్రతి పల్లె ముస్తాబైంది. వేదికలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాలను అధికారులు సిద్ధం చేశారు. ఆహుతులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్లో నేడు జరిగే పంద్రాగస్టు వేడుకలకు మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత మంత్రి ప్రసంగిస్తారు.
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత ప్రసంగించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.