షాబాద్, డిసెంబర్ 29 : విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రంగారెడ్డిజిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. గురువారం షాబాద్లోని హోలీ స్పిరిట్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలిమెట్టు టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఎంఈవో శంకర్రాథోడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తయారుచేసిన టీఎల్ఎం సామగ్రిని పరిశీలించారు. మంచి ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం చివరి వరకు భాషా పరిజ్ఙానం, రాయడం, చదవడంతో పాటు గణిత చతుర్విద ప్రక్రియలపై పట్టు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో టీఎల్ఎం మేళాలు నిర్వహించనున్నామన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన పాఠశాలలను మండల స్థాయి నుంచి, జిల్లా, రాష్ట్ర స్థాయిలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులందరూ టీఎల్ఎం సామగ్రిని ఎంతో బాగా తయారు చేశారని అభినందించారు.
ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేలా టీఎల్ఎం మేళా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ఎంఈవో శంకర్రాథోడ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో టీఎల్ఎం మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు, గౌరవ అధ్యక్షుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
708 ప్రదర్శనలపై అవగాహన
ఇబ్రహీంపట్నం : విద్యార్థులు గణితం, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులపై నైపుణ్యం సాధించాలని జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీఈవో సుశీందర్రావు అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో మండలస్థాయి తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు 708 ప్రదర్శనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
కేశంపేట : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కేశంపేట జడ్పీటీసీ విశాల ఉపాధ్యాయులకు సూచించారు. కేశంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన టీఎల్ఎం మేళాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన బోధన ఉపకరణాలను చూపిస్తూ విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి సుశీందర్రావు హాజరై ఉపకరణాలను పరిశీలించి ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో 32 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి జావీద్ అహ్మద్, ఇన్చార్జి ఎంఈవో మనోహర్, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, సర్పంచ్ వెంకట్రెడ్డి, జీహెచ్ఎంలు పాల్గొన్నారు.