వికారాబాద్, జనవరి 23 : మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులను ఈ నెల 27లోగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత శాఖల ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం మన ఊరు మన బడి కింద చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి సంబంధిత ఇంజినీర్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ .. జిల్లాలో మన ఊరు మన బడి కింద మొదటి విడుతలో 38 మోడల్ పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. అందులో 19 పాఠశాలల్లో పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండే పాఠశాలలన్నింటినీ ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలలో నడకబాటకు ఇరువైపులా పూలతొట్లతో సుందరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో వివిధ మౌలిక సదుపాయాల నిమిత్తం తక్కువ ఖర్చుతో చేపట్టాల్సిన పనులు ఏమైనా మిగిలిపోతే.. ప్రతిపాదనలు సమర్పిస్తే, నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ వివరించారు. పాఠశాలల్లో ఆట వస్తువులతోపాటు గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.