సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : నగర ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో గతంలో కేవలం విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండే రూట్ పాసుల విధానం ఇక నుంచి సాధారణ ప్రయాణికులకూ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రోజూ వారి అవసరాల కోసం సిటీ బస్సులలో ప్రయాణించే వారి ప్రయాణ భారం దాదాపు తగ్గనున్నది. ఈ నెల 27వ తేదీ నుంచే నగర ప్రయాణికుల కోసం అమల్లోకి వచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ అధికారులు తెలిపారు.
రూట్ పాస్లో రూ.200 రాయితీ
కొత్తగా అమల్లోకి వచ్చి రూట్ పాస్ గరిష్ఠంగా ఎనిమిది కిలోమీటర్ల వరకు జారీ చేస్తారు. ఇందుకు రూ.800 చార్జీ చేయాల్సి ఉంటుంది. కానీ రూ.200 రాయితీ కల్పించి రూ.600 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్లో రూ.1200 ఉండగా.. తాజా నిర్ణయంతో రూ.200 రాయితీ ప్రకటించి రూ.1000 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విధంగా పదిహేను రోజుల చార్జీలతోనే నెల రోజుల ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తించిన 162 రూట్లలో తొలుత పాస్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
నగరంలో 1.50 లక్షల బస్పాస్లు
ప్రస్తుతం నగరంలో దాదాపు 1.50 లక్షల జనరల్ బస్పాసులు ఉండగా.. వాటిలో మెట్రో ఎక్స్ప్రెస్ పాసులు 1.25 లక్షలు ఉన్నాయి. ఆర్డినరీ పాసులు కేవలం 25 వేలు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి కాకుండా మరో ఐదు వేలు జీహెచ్ఎంసీ పరిధిలో, పల్లె వెలుగులో కలిపి ఉన్నట్లు చెప్పారు. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన రూట్ పాస్ల వల్ల ప్రయాణికుల సౌకర్యం మరింత మెరుగు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రయాణికుల కోసం ఎన్నో రాయితీలు..
నగర ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో తిరుగుతున్న సిటీ బస్సులలో అనేక రాయితీలు కల్పిస్తూ ఆర్టీసీ యాజమాన్యం వరుస నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 వంటి కొత్త టిక్కెట్ల విధానాన్ని ప్రకటించడంతో పాటు ఆ టిక్కెట్లపై అనేక రాయితీలు కల్పించింది. కొత్తగా రూట్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. భవిష్యత్లో కూడా నగర ప్రయాణికుల కోసం మరిన్ని రాయితీలు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బస్పాస్లు, ఇతర వివరాల కోసం tsrtc.telangana.gov.in, : online.tsrtcpass.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.