ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న సీఎం కప్ క్రీడలు
ధారూరు, మే 23 : వికారాబాద్లో సీఎం కప్ క్రీడల పోటీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఖో-ఖో, వాలీబాల్, బ్లాక్ గ్రౌండ్లో కబడ్డీ, ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంత్రావు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశ్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కోటాజీ ఉన్నారు.
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో..
ఆర్కేపురం : సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. మంగళవారం అథ్లెటిక్స్, ఖో-ఖో పోటీలను నిర్వహించారు. పరుగు పందెంలో క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఖో-ఖోలో నువ్వా నేనా అన్నట్లుగా క్రీడాకారులు తలపడ్డారు. జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, తెలంగాణ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి మనోహర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాస్కర్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ క్రీడా పోటీలను సందర్శించారు.