ఇబ్రహీంపట్నం, జూన్ 14 : గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న న్యూట్రిషన్ కిట్లు తల్లీబిడ్డల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మాతాశిశు మరణాలను తగ్గించటంతో పాటు వారిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం న్యూట్రిషన్కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. న్యూట్రిషన్కిట్లు పొందిన గర్భిణులు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో పేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత సరైన పౌష్టికాహారంలేక దవాఖానల పాలవుతున్నారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 9రకాల పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3495మంది గర్భిణులను గుర్తించిన వైద్యారోగ్యశాఖ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో వీటిని అందజేస్తున్నారు. సమావేశాల్లో అందుకోలేని వారికి స్వయంగా సంబంధిత పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అందజేస్తున్నారు. ఎక్కువమంది గర్భిణులు పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవటం వలన రక్తహీనత తగ్గి పుట్టబోయే పిల్లలు కూడా మరణించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేకపోవటం వలన మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పౌష్టికాహారం కిట్లను అందజేసే విధానం..
ప్రభుత్వం గర్భిణులకు అందజేసే పౌష్టికాహారం కిట్లను పీహెచ్సీ, సీహెచ్సీల ద్వారా గుర్తించిన గర్భిణులకు అందజేస్తున్నారు. 14నుంచి 24వారాల లోపు వారికి సంబంధిత పీహెచ్సీల్లో పౌష్టికాహార కిట్లను అందజేస్తున్నారు. 24నుంచి 32వారాల లోపు వారికి సీహెచ్సీ దవాఖానల్లో అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లు పీహెచ్సీ, చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల ఏరియా దవాఖాన, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖాన, శేరిలింగంపల్లి నియోజవకర్గంలో కొండాపూర్ ఏరియా దవాఖాన, మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గంలో సర్దార్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గంలో వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో వీటిని అందజేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 3495మంది గుర్తింపు..
గర్భిణులకు పౌష్టికాహార పంపిణీ దవాఖానల వారీగా గుర్తింపు పొందిన వారికి అందజేస్తున్నారు. జిల్లాలోని ఎంపిక చేసిన పీహెచ్సీ, సీహెచ్సీలకు ఇప్పటికే న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. అందుబాటులో ఉన్న కిట్లను గుర్తింపు పొందిన గర్భిణులందరికీ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అందజేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేల ద్వారా న్యూట్రిషన్కిట్లను అందజేశారు. మహిళా దినోత్సవం రోజున కూడా కిట్ల పంపిణీ చేపట్టారు.
న్యూట్రిషన్కిట్లో ఉండే పౌష్టికాహార రకాలు..
ప్రభుత్వం గర్భిణులకు అందించనున్న న్యూట్రిషన్కిట్లో 9 రకాల పౌష్టికాహార పదార్థాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. అందులో హార్లిక్స్, న్యూట్రిషన్మిక్స్, పౌడర్, ఐరన్ సిరప్లు 3, కర్జూరాలు 1కిలో, పల్లిపట్టీలు, 500మిల్లీ లీటర్ల నెయ్యిని గర్భిణులకు అందజేయనున్నారు.
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
ప్రభుత్వం గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు కోసం అందజేస్తున్న న్యూట్రిషన్కిట్ల పంపిణీ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ.. ప్రస్తుతం కొనసాగుతున్న కేసీఆర్కిట్ల పంపిణీకి గ్రామాల్లో గర్భిణులు పేర్లను నమోదు చేసుకుంటే వాటి ప్రకారం వారు ఎన్ని వారాలకు అందజేయాలో తెలుసుకుని పీహెచ్సీల్లో ఈ కిట్లను అందజేయనున్నారు.
– వెంకటేశ్వర్రావు, వైద్యారోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా