Telangana | వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వాదనలపై ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వ్యవసాయ రంగం, దాని అవసరాలు, కరెంట్, భూగర్భజలాలు, పంపు మోటర్లు, వాటి వాడకం ఇలా ఎందులోనూ కనీసం అవగాహన లేదన్నట్లుగా రేవంత్రెడ్డి పూటకో తీరుగా మాట్లాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న ఆయన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో కొత్త పల్లవి అందుకున్నారు.
ప్రస్తుత వ్యవసాయ రంగంలో సాధ్యమే కాని 10హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లు వాడితే మూడు గంటలు కరెంట్ చాలదా అని అంటున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్తో గాడిలో పడిన వ్యవసాయాన్ని ఆగం చేసేందుకు ఇప్పటి నుంచే రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని రైతులు అనుమానిస్తున్నారు. మూడు గంటల కరెంట్ ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్ల భారం ఎలా భరిస్తారని నిలదీస్తున్నారు. ఉన్న మోటర్లను పక్కనేసి 10హెచ్పీ మోటర్లు వాడాలంటే కనీసం ఒక్కో మోటరుపై ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల అదనపు భారం మోయాల్సిందే. ఇవన్నీ ఏమీ ఆలోచించని రేవంత్రెడ్డి ఉచిత కరెంట్పై అడ్డ్డగోలుగా మాట్లాడడం తగదని, కాంగ్రెస్ నేతల జిమ్మిక్కు రాజకీయాల మాయలో పడబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 19(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పూటకో మాట.. రైతన్నల పుట్టిముంచే కుట్ర.. మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ అన్నదాతల బతుకులను ఆగమాగం చేయాలని యత్నిస్తున్నది. జిల్లాలో 1,20,713 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే పెద్ద మోటర్ల వాడకంతో ఒక్కో రైతుపై రూ.లక్ష చొప్పున జిల్లా రైతాంగంపై రూ.1200కోట్ల భారం పడనున్నది. వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లు వాడతారా? వాడితే బోర్ల పరిస్థితేంటి! అందులోని నీటి ఊటల మాటేమిటని ? రైతాంగం ప్రశ్నిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు నమ్మితే నిండా మునగడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో గతంలోనే కరెంటు ఇబ్బందులతో ఆగమాగం అయ్యామని.. ఇగ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు 24 గంటలు నిరంతరాయంగా తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటును అందిస్తుండగా.. రేవంత్రెడ్డి 3 గంటల కరెంటే చాలని ప్రకటించడంపై రైతాంగం భగ్గుమంటున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాత్రి, పగలు తేడా లేకుండా రెండు, మూడు గంటల పాటు ఇచ్చిన కరెంటుతో పాము, తేలు కాట్లకు గురైన ఉదంతాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులు రావడం ఖాయమని పేర్కొంటున్నారు. 10 హెచ్పీ మోటర్ల వాడకం అన్నది సాధ్యమైన పనికాదని, మోటర్లు దెబ్బతింటే మరమ్మతులు చేసుకోవడం కత్తిమీద సాములాంటిదని ఆందోళన చెందుతున్నారు. పెద్ద మోటరును కొనుగోలు చేయడం ఎనలేని భారంతో కూడుకున్నదని, జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతల మాయలో పడబోమని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో అవస్థలు పడ్డాం. ఎకరం, రెండు ఎకరాలు పారితే గగనంగా ఉండేది. 24 గంటల కరెంట్ ఇస్తే బోరు బావులకు 3హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు సరిపోతయ్. 10 హెచ్పీ మోటర్లకు ఖర్చు ఎక్కువే.. బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. రేవంత్రెడ్డి మాటలు సరైనవి కాదు. వ్యవసాయదారుడికే ఆ కష్టం తెలుస్తది..
– సుభాన్రెడ్డి, నారాయణపూర్ (వికారాబాద్)
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నది. 10 హెచ్పీ మోటర్లు బిగిస్తే బోర్లలో ఊట తగ్గుతది. మోటర్లు మోతాదుల పోస్తేనే వచ్చే ఊటను చాలా సమయం వరకు నీరు వచ్చి పొలం పారుతది. కూరగాయల పంట సాగు చేస్తుంటాం. 5 హెచ్పీ మోటర్ సరిపోతుంది. మూడు గంటల కరెంట్ అంటే రైతులు ఆగం కావడం ఖాయం.
– నర్సింహారెడ్డి, మైలార్దేవరంపల్లి (వికారాబాద్)
2009లో మా నాన్న నర్సింహారెడ్డి రాత్రి బోరు నీరు పారబెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల వల్లే ఈ ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మేదిలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో ఎప్పుడు పడితే అప్పుడు పంటలకు నీరు పారబెట్టుకుంటున్నాం.
– కొండారెడ్డి, మైలార్దేవరంపల్లి (వికారాబాద్)
10 హెచ్పీ మోటర్, పైపులకు ఖర్చు ఎక్కువ. ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతయ్. ఉమ్మడి పాలనలో కరెంట్ కోతలతో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ సర్కార్ 24 గంటల విద్యుత్తు సరఫరా చేయడంతో కష్టాలు తీరాయి. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ రంగంపై అవగాహన లేకపోవడంతోనే రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారు. తెలంగాణ వచ్చాకే రైతుల దశ, దిశ మారింది.కాంగ్రెస్కు ఓటు వేస్తే మనం కోరికోరి కష్టాలు తెచ్చుకున్నట్లే.
– రఘు, (షాద్నగర్రూరల్)
తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. 10 హెచ్పీ మోటర్లు బిగించాలంటే సన్నకారు రైతులకు 50 వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చును రైతులు ఎలా భరిస్తారు. కాంగ్రెస్ హామీలను నమ్మే స్థితిలో రైతులు లేరు. తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్తును ఇస్తుండడంతో రైతుల చావులు తగ్గాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– రవీందర్ (శంకర్పల్లి)
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని పథకాలు అమలు కావడం కష్టం. సాధ్యం కాని హామీలిచ్చి రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. వ్యవసాయానికి 3 గంటలు సరిపోతుందనడం సరికాదు. 10 హెచ్పీ మోటర్లు పెడితే ఫ్యూజ్లు ఎగిరిపోతయ్. దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవద్దు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ఆయనకు రైతులంతా మద్దతు తెలుపాలి.
– కావలి పెద్ద ఈశ్వరయ్య, రైతు, దేవునిఎర్రవల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
వ్యవసాయంపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు కరెంట్పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్తో రైతులమందరం సంతోషంగా ఉన్నాం. మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోతుందా? పొలం పరుతుందా.. అన్న విషయాలను గ్రహించాలి. 10 హెచ్పీ మోటర్ని మా ప్రాంతంలో వాడరు.
– కడారి రామకృష్ణ, (కడ్తాల్)
మా అన్న అనంత్రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాంగ్రెస్ హయాంలో మా అన్న కరెంట్ షాక్తో చనిపోయాడు. ఆ బెంగతో మా నాన్న చనిపోయాడు. వదిన మతిస్థిమితం కోల్పోయింది. కాంగ్రెస్ వల్ల మా కుటుంబమే ఆగమైంది.
– సత్యనారాయణ, ఆలంపల్లి (వికారాబాద్)
10హెచ్పీ మోటరు బిగిస్తే బోర్లు ఎండి పోతయ్. కాంగ్రెస్ నాయకులకు వ్యవసాయంలో బాధలు తెల్వవు. 10హెచ్పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పడి పేలిపోయే ప్రమాదం ఉంది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని 24గంటల కరెంట్ వస్తున్నది.
– నర్సింహులుగౌడ్, రైతు, బూర్గుల గ్రామం (షాద్నగర్టౌన్)