ప్రజా శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ను స్థాపించి దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలను అమలు చేయాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఒక విజన్తో ముందుకెళ్తున్నారని, మన పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్ల మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సావిత్రీబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రైతుబంధు, రైతుబీమా పథకాలు అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేవెళ్లతో ఇంద్రన్నకు విడదీయని అనుబంధం ఉందని, ఇక్కడ జరిగే అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.
80వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ల పర్వం కొనసాగుతున్నదని, ప్రైవేట్ రంగంలో 3లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వీటిల్లో లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.
– షాబాద్, జనవరి 3
షాబాద్, జనవరి 3 : తెలంగాణ మాదిరిగా బీఆర్ఎస్తో దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలుకు ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే అందరూ నిలబడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్లలో ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి రూ.85లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇంద్రారెడ్డి మెమోరియల్ పల్లె ప్రకృతి వనం పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సావిత్రీబాయి జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. రేగడిఘనపూర్లో రూ.కోటితో నిర్మించనున్న బ్రిడ్జికి, సింగప్పగూడలో రూ.కోటితో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన, రూ.37లక్షలతో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొత్త గ్రామపంచాయతీగా సింగప్పగూడ అనతికాలంలోనే అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నదని తెలిపారు. గ్రామ ప్రజల చిరకాల వాంఛ బ్రిడ్జికి రూ.కోటి మంజూరు చేశామన్నారు. కొంతమంది మతాల గురించి రాజకీయాలు చేసేవారికి ఈ గ్రామంలో ముస్లిం సర్పంచ్ గుడి నిర్మాణంలో ముందుండటం కనువిప్పు కావాలన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రైతు బంధు, రైతు బీమా పథకాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ వస్తే ఎడారిఅన్నవారు.. నేడు ఈ ప్రాంతంలో భూములకు ఎంత డిమాండ్ ఉందో చూడాలన్నారు.
చేవెళ్లతో ఇంద్రన్నకు విడదీయని అనుబంధం
చేవెళ్లతో ఇంద్రన్నకు విడదీయని అనుబంధం ఉందని, ఇక్కడ జరిగే అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ఆలూరు ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు, భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మహర్దశ రానుందని మంత్రి పేర్కొన్నారు. సెంటిమెంట్గా చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా మొదటిసారి ఎగురవేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సావిత్రీబాయిఫూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, ఎంపీడీవో హిమబిందు, ఎంపీవో విఠలేశ్వర్జీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచులు శైలజ, నర్సింహులు, రహీమాబేగం, శివారెడ్డి, ఎంపీటీసీ వాసవి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ఆలీ, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, రవికాంత్రెడ్డి, మాణిక్యరెడ్డి, నాగార్జునరెడ్డి, రాములున్నారు.
కేసీఆర్కు తోడ్పాటునందించాలి
ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో గ్రామాలు ఎట్లుండే.. ఇప్పుడు ఎలా మారాయో చూస్తే సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20లక్షల నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉపాధి హామీ పనుల్లో కొత్తగా బయోమెట్రిక్తో చిన్న గ్రామాల్లో పనులు చేసుకుంటుంటే.. అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేక.. బయోమెట్రిక్లో వేలిముద్రలు పడకుంటే కూలీ డబ్బులు రూ.500 ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు. ప్రతి గ్రామానికి ముందు ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచుకున్న తర్వాత ఇలాంటివి చేయాలన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక విజన్తో ముందుకు వెళ్తున్న కేసీఆర్కు మనమంతా తోడ్పాటునందించాలని సూచించారు.
మిగిలిన పనులన్నీ త్వరలోనే పూర్తి
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల మండలం ఆలూరులో పరిశ్రమలు ఏర్పాటు చేయించి, ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని మంత్రిని కోరారు. నియోజకవర్గానికి రూ.10కోట్లు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, అందులో మండలానికి రూ.2కోట్ల చొప్పున కేటాయించామని, మండల ప్రజలను ఒప్పించి ఆ మొత్తం నిధులతో రేగడి ఘనపూర్, సింగప్పగూడ గ్రామాల్లో బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పూడూరు మండలం నుంచి చేవెళ్ల వరకు రైతులంతా అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని.. రైతుల కోరిక మేరకు రోడ్లను బాగు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మిగిలిపోయిన పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.