ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 27 : రంగారెడ్డి జిల్లాలో గత 15 రోజలుగా సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసును తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు మంగళవారం ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నకిలీమద్యం కేసులో ప్రధాన సూత్రధారులైన కొండల్రెడ్డి, నాగేశ్వర్రావు, సాయిప్రసాద్, తదితరులను గత రెండు రోజులుగా విచారించి మంగళవారం ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు యాచారం మండలం మొండిగౌరెల్లి నుంచి ప్రారంభమైందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. మొండిగౌరెల్లికి చెందిన చెట్టుపల్లి రాజు దగ్గర నకిలీమద్యం ఉన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ద్వారా అందిన సమాచారం మేరకు నిందితులైన కొండల్రెడ్డి, తదితరులు ఒక ముఠాగా ఏర్పడి ఒరిస్సా రాష్ట్రంలో తయారైన నకిలీ మద్యాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం, హయత్నగర్ తదితర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు తీసుకుని తాము ఒరిస్సా వెళ్లినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఒరిస్సాలో తాము జరిపిన విచారణలో నకిలీ మద్యం రాకెట్ గుట్టురట్టయింది. దీంతో నకిలీమద్యం తయారీకి సంబంధించి, ఒరిస్సాకు చెందిన సంజయ్కుమార్తో పాటు వారికి సహకరిస్తున్న మొత్తం 15మంది నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. గతంలోనే 8మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ముగ్గురిని మంగళవారం రిమాండ్కు తరలించగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కొండల్రెడ్డి, బాలరాజు, సంజయ్కుమార్, నాగేశ్వర్రావు, మణికంఠ, చిల్లుబాయ్, సూర్య, జ్యోతిరెడ్డి ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్ శివారులకు పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని చేరవేసి నిల్వ ఉంచారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నారు. అక్కడి నుంచి శివారు ప్రాంతాల్లోని బెల్టుషాపులతో పాటు ఇతరులకు మద్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణ దాదా పు పూర్తయిందని, వీరి నేరచరిత్రను గుర్తించి అవసరమైతే పీడీ యాక్టును ప్రయోగిస్తామని అన్నారు. నకిలీ మద్యం మూలాలు ఎక్కడ ఉన్నా తమకు సమాచారం అందించాలన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వీటిని ఎవరూ ఉపేక్షించవద్దన్నారు. కార్యక్రమంలో సరూర్నగర్ ఏఈఎస్ హన్మంత్రావు, హయత్నగర్, ఇబ్రహీంపట్నం ఎస్ఎచ్ఓలు లక్ష్మణ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, ఎక్సైజ్ పోలీసులు యాదయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.