Telangana | జవహర్నగర్, ఫిబ్రవరి 20: పస్తులున్నాం… లాఠీ దెబ్బలు తిన్నాం… కానీ తెలంగాణ ఉద్యమానికి వెనకడుగు వేయలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల ఊసే ఎత్తడం లేదని, పోరాటాలు కొత్తేమి కాదని మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, మేనేపేస్టోలో పెట్టిన ప్రకారం హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జవహర్నగర్ కార్పొరేషన్ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు పిన్నొజు సుధాకర్చారి ఆధ్వర్యంలో ఉద్యమకారులు హామీలు నెరవేర్చాలని కోరూతూ గురువారం సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డు ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సుధాకర్చారి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల పాత్ర కీలకమని, దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకాలకు 250గజాల ఇంటిస్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి అందజేయాలని పేర్కొన్నారు. ఉద్యమంలో పనిచేసి లబ్ధిపొందని వారికి తెలంగాణ సంస్కృతి సారథిలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి పోస్టుకార్డులు రాసి పోస్టుడబ్బాలో ఉత్తరాలు రాసి వేశారు.
ఈ కార్యక్రమంలో ఆనందాస్ ప్రకాష్, కూటికంటి వెంకటేష్, కుమ్మరి నర్సింహా, సత్యనారాయణ, ఆకుల నర్సయ్య, పాము భాస్కర్, పరుశురాం, ఎల్లస్వామి, సోమయ్య, మహేశ్, కాసీం, చంద్రశేఖర్, నర్సింహాయాదవ్, కృష్ణయాదవ్, నరేష్యాదవ్, రమేష్చారి, పుష్ఫ, మహేశ్వరి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.