వికారాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకుగాను తెలంగాణ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం అద్భుత సేవలందిస్తున్నది. ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తూ పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నది. గడిచిన ఏడాదిన్నర కాలంలో 13.80 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో 73,478 మందికి లబ్ధి చేకూరింది. ఈ కేంద్రంలో కరోనా, రక్త, మూత్ర, బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ తదితర పరీక్షలకు సంబంధించి శాంపిల్స్ను సేకరించి రెండు రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పేదలకు మరో వరంగా రేడియోలజీ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు అందుబాటులోకి రానున్నాయి.
పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించి వైద్య నిర్ధారణ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వికారాబాద్ ఏరియా దవాఖానలోని భవనంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ఇప్పటివరకు 13.80 లక్షల వైద్య నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఏడాదిన్నరగా జిల్లావ్యాప్తంగా 73,478 మంది నిరుపేదలకు లబ్ధి చేకూరింది. ఎల్ఎఫ్టీ, కిడ్నీ, లివర్, థైరాయిడ్లకు సంబంధించిన బయో కెమిస్ట్రీకి సంబంధించి 1,13,920, బ్లడ్ లెవల్స్ ఎంత మేరకు ఉన్నాయనే వివరాలను తెలుసుకునే పాథాలజీ పరీక్షలు-55,415., టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూలకు సంబంధించి 35,336 పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఇప్పటివరకు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాలోని వికారాబాద్ ఏరియా దవాఖానలో ఏడాదిన్నర క్రితం నుంచి డయాగ్నిస్టిక్ కేంద్రాన్ని అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక పరికరాలతో 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు చేసేలా డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల నుంచి ఆయా పీహెచ్సీల సిబ్బంది వైద్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి శాంపిల్స్ సేకరించి వికారాబాద్లోని టీ డయాగ్నోస్టిక్ హబ్కు అందజేస్తున్నారు. శాంపిల్ చేరిన రెండు రోజుల్లోనే ఫలితాలను సిబ్బంది వెల్లడిస్తున్నారు. రోగుల నుంచి శాంపిల్స్ సేకరించే సమయంలో వారి ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తీసుకొని, ల్యాబ్లో పరీక్షల అనంతరం రోగి మొబైల్ నెంబర్తోపాటు ఈ-మెయిల్స్కు ఫలితాలను పంపుతున్నారు. దీంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి సీటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు
వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వం రేడియోలజీ కేంద్రాన్ని మంజూరు చేసింది. ప్రైవేట్ కేంద్రాల్లో సిటీ స్కాన్కు రూ.3500-4000, ఎంఆర్ఐ స్కాన్కు రూ.3వేల వరకు వసూలు చేస్తుండడం పేదలకు కష్టంగా మారడంతో ప్రభుత్వం ఉచితంగా సాటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లను అందుబాటులోకి తీసుకురానుంది.
రెండు రోజుల్లో ఫలితాలు
– పల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా పేదలకు సత్వర సేవలందుతున్నాయి. ఏ పరీక్షకు సంబంధించిన శాంపిల్ ఇచ్చినా రెండు రోజుల్లోనే ఫలితాలనిస్తున్నాం. జిల్లా ప్రజానీకమంతా ఉచిత డయాగ్నిస్టిక్ సేవలను వినియోగించుకోవాలి. జిల్లాకు రేడియోలజీ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.