తాండూరు, ఫిబ్రవరి 11 : వికారాబాద్ జిల్లాలోనే తాండూరు నియోజకవర్గం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయాలకు కేంద్రంగా బాసిల్లుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాండూరు నియోజక వర్గం పరిధిలో చారిత్రాత్మకమైన దేవాలయాలు ప్రసిద్ధి గాంచినవి. ముఖ్యంగా శైవ మత ఆలయాలకు తాండూరు ప్రసిద్ధి గాంచినదని పురోహితులు తెలిపారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో దాదాపు 400 ఏండ్ల చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ఏకాంబర రామలింగేశ్వర ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
ఈ ఆలయం శివరాత్రి, శ్రావణ, కార్తిక మాసంలో భక్తులతో కిక్కిరిసిపోనున్నది. ముఖ్యంగా శ్రావణమాసం చివరి సోమవారం, మంగళ వారాల్లో పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అలాగే వందల ఏండ్ల క్రితం నిర్మించిన యాలాల మండలం బాకారం ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఎంతో మహత్తును కలిగి ఉండి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ దేవాలయంలో నవగ్రహ దేవతలు కూడా కొలువుదీరడం విశేషం. ఇటీవల పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అదేవిధంగా యాలాల మండలం జుంటుపల్లి అటవీ ప్రాంతంలో కొలువు దీరిన శ్రీ సీతారాముల వారి దేవాలయం, సంగమేశ్వర శివాలయం ఎంతో చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం 500 ఏండ్ల ఘన చరిత్రను కలిగి ఉంది. పట్టణంలోని పొట్లి మహారాజ్ దేవాలయం, పాత తాండూరు వీరభద్రస్వామి, చెరువెంటి ఈశ్వర ఆలయం, అంతప్పబావి శివాలయం, రసూల్పూర్ హనుమాన్, పెద్దేముల్ మండలం ఇందోల్ అటవీ ప్రాంతంలోని రామలింగేశ్వర దేవాలయాలు ఎన్నోవందల ఘన చరిత్రను చాటుతున్నాయి.
తాండూరు మండలం అంతారం తండాలో పద్నాలుగేండ్ల క్రితం భూకైలాస్ దేవాలయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాసూపవార్ నిర్మించారు. ఈ ఆలయ పరిసరాల్లోని భారీ 64 అడుగుల ఎత్తున శివుడి విగ్రహం, 24 అడుగుల ఎత్తున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయ పరిసరాల్లో నిర్మితమైన గిరిజనుల ఆరాధ్యదైవమైన మారెమ్మ, సేవాలాల్ దేవాలయాలు కూడా భక్తులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. శివరాత్రి, శ్రవణ మాసం, కార్తిక మాసంతో పాటు భక్తులు, పర్యాటకులు నిత్యం ఈ దేవాలయం సందర్శనకు వస్తున్నారు. వచ్చే శివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా కనిపించేందుకు ప్రత్యేక విగ్రహాలతో పాటు రంగులు వేస్తున్నారు. 18న జరిగే శివరాత్రి ఉత్సవాలకు తాండూరు నియోజకవర్గంలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి.