పునర్విభజన రగడ మరింత ముదురుతున్నది. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా.. ఏకపక్షంగా తోచినట్లు డివిజన్లను సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖానీ చేస్తున్నదని మండిపడుతున్నారు. జనాభా ప్రమాణాలు.. భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి.. కేవలం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రక్రియ చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు సమయం ఇవ్వగా, పునర్విభజన లోపాలను ఎత్తిచూపుతూ.. ఇప్పటికే 1500లకుపైగా ఫిర్యాదులు అందడం గమనార్హం. కాగా, సోమవారం తలసాని నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం బల్దియా కమిషనర్ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ రూల్స్కు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. ప్రజల ప్రయోజనాలను కేంద్రీకరించి మాత్రమే వార్డుల పునర్విభజన జరగాలని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే కోర్టు తలుపులు తట్టడం ఖాయమని హెచ్చరించింది.
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో డివిజన్ల పునర్విభజన అంశం భగ్గుమంటున్నది. 300 డివిజన్లను ఖరారు చేసి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి వారం రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నెల 10 నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్, జోనల్ కార్యాలయాలకు అభ్యంతరాలు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే 1500లకు పైగా ఫిర్యాదులొచ్చాయి. సోమవారం డీలిమిటేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీలతోపా టు ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. వార్డు ల విభజన ఏ మాత్రం శాస్త్రీయంగా లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీల ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన తెలిపారు. కమిషనర్ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షం గా నిర్ణయాలు తీసుకున్నారని నేతలు మండిపడ్డారు. తమ అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మొదట్నుంచి వార్డు ల విభజన పారదర్శకత పాటించలేదంటూ మండిపడుతున్నది.
ఒక స్పష్టమైన విధానం లేకుండా డీలిమిటేషన్ పేరుతో జీహెచ్ఎంసీలో డివిజన్లను ఇష్టమొచ్చినట్లుగా ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ల ఏర్పాటులో జరిగిన తప్పిదాలపై తలసాని ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్సీలు దాసోజు శ్రవ ణ్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ కర్ణన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డివిజన్ల ఏర్పాటు గందరగోళంగా ఉందని ఆయనకు వివరించారు. 1996లోని రూల్ 8 నిబంధనలను కమిషనర్ పాటించలేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా వార్డు మ్యాప్లు, జనాభా వివరాలు, సరిహద్దు వివరాలను తెలియజేయలేదని విమర్శించారు. కార్పొరేటర్ల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేం దుకే మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ బీఆర్ఎస్ బృందానికి వివరించారు.
డీలిమిటేషన్పై నిలదీస్తాం
రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా.. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా కార్యాల యాల్లో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్లను ఏర్పాటు చేశారు. అంత హడావుడిగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసి 150 ఉన్న డివిజన్లను 300లకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది. డివిజన్ల సరిహద్దుల్లో పారదర్శకత లేదు. మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడున్న 150 డివిజన్లకు సరైన అధికారులు, మ్యాన్పవర్ లేని పరిస్థితుల్లో నూతనంగా మరో 150 డివిజన్లను ఏ విధంగా పెంచారు. కార్పొరేటర్లకు గుడ్ న్యూస్ అని , డివిజన్కు రూ. రెండు కోట్ల చొప్పున నిధులు ఇస్తామని చెప్పి హడావుడి చేసి ఇన్చార్జి మంత్రులకు అప్పగించడం ఎంత వరకు సబబు. నగరంలోని వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినవి మాత్రమే తొలగిస్తున్నారు. తొలిగిస్తే అన్ని ఫ్లెక్సీలను తొలగించాలి. కౌన్సిల్లో ఈ అంశంపైనా నిలదీస్తాం.
అశాస్త్రీయం: హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం వెలువరించిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. జీహెచ్ఎంసీ సమీపంలోని పలు మున్సిపాలిటీలు, గ్రామాల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటిని విలీనం చేసి డివిజన్ల సంఖ్యను ఏకపక్షంగా 300కు పెంపుదల చేశారంటూ చికడపల్లికి చెందిన వినయ్కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారం విచారించారు. ఇరుపక్షాల వాదనలను మంగళవారం వింటామని ప్రకటించారు. ప్రస్తుత రాంనగర్ డివిజన్ (164) నుంచి కొన్ని ఇండ్లను అడిక్మెట్ డివిజన్(163)తో విలీనం చేయడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. డివిజన్ సరిహద్దు ఏకపక్షంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతో నే విభజన జరిగిందన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనను అడ్డుకోవాలన్నారు. పన్నుల చెల్లింపులు, ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు వస్తాయన్నారు. అధికారులకు అభ్యంతరం తెలిపినా ఫలితం లేదన్నారు. వాదనలపై స్పందించిన జడ్జి ప్రభుత్వ వాదన నిమిత్తం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.