ఆర్కేపురం, జనవరి 4 : నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. సేవా ప్రవృత్తిని అభిరుచిగా మార్చుకుని ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్ట్రీట్ కాజ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పది రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తమ తరగతి విజ్ఞానాన్ని ప్రజలకు అందించి అవగాహన కల్పిస్తున్నారు. బృందాలుగా పల్లెల్లో పర్యటించి, ప్రతి ఇంటికీ తిరిగి ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటున్నారు. వెయ్యిమందికి పైగా మధుమేహాం, అధిక రక్తపోటు, మోకాళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
శుభ్రత….భద్రత..
పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో శ్రమదానం చేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. అనాథశ్రమం విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేసి వారికి ప్రేరణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తపస్వి అనాథ ఆశ్రమంలో ఉచితంగా కంప్యూటర్లు పంపిణీ చేసి లైబ్రరీని ఏర్పాటు చేశారు. పుట్పాత్లపై నివసించే వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.
సమాజంపై అవగాహన వస్తుంది..
చదువుతో పాటు సేవా గుణాల్ని అలవర్చుకోవడం అవసరం. రోజూ కళాశాలలో అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలు శ్రద్ధగా వింటాం. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సమాజంపై అవగాహన కలిగింది. భవిష్యత్లోనూ సేవలందించడానికి ముందుకు సాగుతాం.
– నిఖిత్ , స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు