రంగారెడ్డి : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయు (Teachers ) సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకొని పరిష్కరిస్తుందని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్( Speaker Gaddam Prasad kumar) అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయుల సహకారం ఉండాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు, టీటీయూ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల బలవంత్రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సర్వీసు రూల్స్, బదిలీలు, పదోన్నతులు, 317 జీవో బాధితులను వెనక్కి రప్పించడం, నెల నెల జీతాలు ఒకటో తేదీన అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులు చెల్లించాలని, పండిత్, పీఈటీ అప్గ్రేడేషన్, అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు టి.సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి ఏ.రాఘునందన్రావు, తదితరులు పాల్గొన్నారు.