రంగారెడ్డి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగులు ప్రతిభావంతులు. విభిన్న అంశాల్లో వారికి ఎవ్వరూ సాటి లేరు. వారి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఎంత ఉన్నతులైనా దివ్యాంగుల మేధస్సుతో పోటీ పడలేరు. ఇది నిజం. శారీరకంగా బాగున్న వారెవ్వరైనా.. దివ్యాంగుల బుద్ధి, ఏకాగ్రత అంశాల్లో సరితూగలేరు. వారి కాళ్లపై వారు నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులైన విద్యార్థులు, వయోజనుల కోసం ప్రత్యేక స్కీములు తీసుకొచ్చి, వారిని ఆర్థికంగా నిలబెట్టేందుకు చేయూతనిస్తున్నది. విద్యార్థులకైతే.. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నది. ప్రత్యేక స్కాలర్షిప్స్, ఫీజు మాఫీలు లాంటి వాటిని వారికి అందుబాటులోకి తీసుకొచ్చి అమలు చేస్తున్నది. చదువుకున్న, చదువులేని వయోజనులైన (21 సంవత్సరాలు పైబడిన) వారికి ప్రత్యేక స్కీములను అందిస్తూ వారికి ఎదుగుదలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. నెలవారీ పెన్షన్ రూ.3,016లతో పాటు ప్రత్యేక రుణాలను కూడా అందించి మమ్మల్ని సర్కారు ఆదుకుంటున్నదని దివ్యాంగులు వేనోళ్ల కొనియాడుతున్నారు.
పలు రకాల ప్రోత్సాహకాలు
దివ్యాంగుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం లక్ష లోపు ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం వారికి సబ్సిడీతో కూడిన రుణాలను అందిస్తున్నది. వారికి ‘త్రీ వీలర్, ట్రై వీలర్, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ఊత కర్రలు, చెవి మిషన్లు, పెట్టుడు అవయవాలు, బ్రెయిలీ పలకలు, ల్యాప్టాప్స్, మోటార్ యంత్రాలు’ మొదలైన వాటిని ప్రభుత్వం తెలంగాణ దివ్యాంగుల కో ఆపరేషన్ ద్వారా అందజేస్తున్నది. ఇవే కాకుండా దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహించేందుకు ఆ దంపతులకు రూ.లక్ష అందజేస్తున్నది. దివ్యాంగుల పునరావాస పథకం ‘ఈఆర్ఎస్’ (ఎకానమిక్ రిహాబిలిటేషన్ స్కీమ్)ను రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా ఒక యేడాదికి కోట్లాది రూపాయలను దివ్యాంగుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
ఎవరికి ఏం కావాలో.. కేసీఆర్ సార్కు తెలుసు
– డి.రఘురాములు, కోళ్ల పడకల్, మహేశ్వరం మండలం
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, దాంతోపాటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో మా దశ తిరిగింది. సీఎం కేసీఆర్ దేవుడు. సమాజంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో.. అన్నీ తెలుసు. కాబట్టే.. మమ్మల్ని పట్టించుకొని మాకు నెలకు రూ.3,016 పింఛన్ ఇచ్చి, ఇంకా సబ్సిడీతో కూడిన రుణాలు కూడా ఇస్తున్నరు. కాళ్లు, చేతులు లేకపోతే.. మమ్మల్ని చూసే నాథుడే లేడు. అసువంటిది.. టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నది. లక్ష రూపాయల లోను తీసుకుని బైకులు, ట్రాక్టర్ల పంక్చర్ల దుకాణం పెట్టుకొని పొట్ట పోసుకుంటున్న. ప్రభుత్వానికి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా..
– ఎన్.మహేందర్, కొంగరకలాన్, ఆదిబట్ల మండలం
నేను గీత కార్మికుడిని. తాటిచెట్టు మీది నుంచి పడిపోయిన. రెండు కాళ్లు పోయినయి. నడుముకు తీవ్రమైన దెబ్బ తగిలింది. ఇల్లు గడిచే ఆసరా కనిపించలేదు. నెలకు రూ.10 వేల దాకా నా మందులకే సరిపోతుంది. తెలిసిన వారిని అడిగి అధికారుల దగ్గరికి పోయిన. అన్ని రకాల పత్రాలు జోడించి ఒక లక్ష రూపాయల రుణానికి దరఖాస్తు చేసుకున్న. అధికారులు నా పరిస్థితిని చూసి లక్ష మంజూరు చేసిండ్రు. కిరాణా దుకాణం పెట్టుకున్న. కాళ్లు పోయినా.. మూడు చక్రాల బండి తీసుకొని సరుకులు తీసుకొస్తున్న. సీఎం కేసీఆర్ సారుకు, తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులకు రుణపడి ఉంటా.. మా అసుంటోళ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే.. మా గతి ఏంగాను? అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
తెలంగాణ ప్రభుత్వానికి చేయెత్తి మొక్కాలె..
– మహేందర్, హస్తినాపురం, ఎల్బీనగర్ మండలం
తెలంగాణ ప్రభుత్వానికి చేయెత్తి మొక్కుతున్నా. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులందరికీ నేను, నా కుటుంబం రుణపడి ఉంటం. ఫ్లోరైడ్ సమస్య వల్ల నాకు 80% వైకల్యం సంభవించింది. బతుకు అగమ్యగోచరమైంది. నా సమస్యపై ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. ప్రభుత్వం, అధికారులు, నాయకులు నా మొర ఆలకించి రూ.50 వేల రుణం వచ్చేలా చేసిండ్రు. వంద శాతం సబ్సిడీ రుణం అందుకున్నా. ఆ రుణంతో చిన్నపాటి ‘లేడీస్ కార్నర్’ పెట్టుకున్న. ప్రభుత్వాధినేతలకు పలు సమస్యలపై అవగాహన ఉండబట్టే.. మా కోసం ఇలాంటి పథకాలు తీసుకొచ్చి ఆదుకుంటున్నరు. అవగాహన లేని ప్రభుత్వాలు, నాయకులు వచ్చినా ఏం ఫాయిదా? తెలంగాణ రాకతోనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది. ‘కేసీఆర్ సార్ నాకు దైవం, ప్రభుత్వమొక ఆలయం’.
దివ్యాంగులు ఆర్థికంగా నిలబడాలనే..
– మోతీ, జిల్లా సంక్షేమ శాఖాధికారి
దివ్యాంగులు ఆర్థికంగా నిలబడాలని ప్రత్యేకంగా రుణాలను కల్పించి, వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అర్హులైనవారు అన్ని రకాల ధ్రువపత్రాలతో సంబంధిత కార్యాలయంలో వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఎవరూ చేయని విధంగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం, అధికారులు ఆసరాగా నిలుస్తున్నారు. మంచి సంకల్పంతో ముందుకు రండి. కావాల్సిన రుణాలకు దరఖాస్తు చేసుకోండి. మీకు అండగా మేమున్నాం.
ఆర్థిక పునరావాస పథకం(ఈఆర్ఎస్)
‘దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడాలి. ఒకరికి వారు భారం కాకూడదు’ అన్న కోణంలో ఏదైనా దుకాణం, ఉపాధి కల్పించే పనుల్లో భాగంగా ఈ పథకాన్ని 2020లో ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. జిల్లాలోని వందల సంఖ్యలో ఉన్న దివ్యాంగులకు ఆర్థికపరమైన పునాదిని ఏర్పస్తున్నది. ఇప్పటివరకు ఈ పథకం కింద జిల్లాలో 121 మంది దివ్యాంగులు పునరావాసం పొందారు. ఈ ఏడాదిలో 43 మందికి రుణాలు మంజూరు కానున్నాయి. జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతున్నది. అర్హులు మండలస్థాయిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘నాన్ బ్యాంకింగ్’, ‘బ్యాంకింగ్’ యూనిట్లుగా ‘ఈఆర్ఎస్’ రుణాలను ప్రభుత్వం అందిస్తున్నది. నాన్ బ్యాంకింగ్ ద్వారా రూ.50 వేల రుణాలను వంద శాతం సబ్సిడీతో, బ్యాంకింగ్ ద్వారా రూ.లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలను అందిస్తున్నది. లక్షకు 80% సబ్సిడీ, రెండు లక్షలకు లక్షా60 వేల సబ్సిడీ, మూడు లక్షలకు లక్షా80 వేల సబ్సిడీని ఇస్తున్నారు. 2020-21లో నాన్ బ్యాంకింగ్ రుణాలు 24 మందికి, బ్యాంకింగ్ రుణాలు రూ.లక్ష ఆరుగురికి, 2 లక్షలు ముగ్గురి, మూడు లక్షలు ఆరుగురికి మొత్తంగా 39 మందికి ఆ ఏడాది రుణాలు అందించారు. 2021-22లో మరో 39 మందికి రుణాలు అందించింది. ప్రస్తుత ఏడాది 43 మందికి అందించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 6 వరకు స్వీకరించనున్నట్టు సమాచారం.