పరిగి : అంధులకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లూయీ బ్రెయిలీ 213వ జయంతి వేడుకలు డీపీఆర్సీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూయీ బ్రెయిలీ ఒక గొప్ప మానవతావాది అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అంధులు సైతం విద్య ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఏకైక లక్ష్యంతో లూయిస్ అంధుల కోసం లిపిని కనిపెట్టారని చెప్పారు. అందువల్లే ఆయన పేరిట బ్రెయిలీ లిపి అని పేరు వచ్చిందన్నారు. అంధులు ప్రపంచ వ్యాప్తంగా ఈ లిపిలోనే విద్య కొనసాగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 30కోట్ల మంది అంధుల కోసం లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో అక్షరజ్ఞానం కలిగించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ అని తెలిపారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి మాట్లాడుతూ అంధులకు ఉపయోగపడే పరికరాలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అంధులకు ఏవైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే తమను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో టీటీడీవో కోటాజీ, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు కృష్ణవేణి, వెంకటేశ్వరమ్మ, రేణుక, విజయలక్ష్మీ సిబ్బంది పాల్గొన్నారు.