‘తాండూరు కంది పప్పునకు అంతర్జాతీయ గుర్తింపు రావడం రైతన్నల విజయం.. భౌగోళిక గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది… ఇది తెలంగాణ గొప్పతనం, తాండూరు కందిపప్పు ప్రతిష్టను కేంద్రం గుర్తించింది..’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు ధ్రువీకరణ పత్రం ప్రదానోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని యాలాల రైతు ఉత్పత్తిదారుల సంఘానికి సర్టిఫికెట్ను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉద్దండపూర్ వద్ద జరిగే పనులు పూర్తైతే నూటికి నూరుపాళ్లు వికారాబాద్ జిల్లాకు సాగునీరు అందుతాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోసే మోటర్ల సామర్థ్యం 149 మెగావాట్లని, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఆసియాలోనే అతిపెద్ద పంపులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులని మంత్రి తెలిపారు. కొంతమంది దురుద్దేశంతో నీళ్లు రాకుండా కేసులేస్తున్నారని, ప్రాజెక్టును ఆపాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వికారాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు ధ్రువీకరణ పత్రం ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ఎంపీ రంజిత్రెడ్డితో కలిసి యాలాల రైతు ఉత్పత్తిదారుల సంఘానికి భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని.. పాలమూరు దాకా వచ్చినయ్.. నాలాపూర్, ఏదులా, ఒట్టెం, కరివెన, ఉద్దండపూర్ వద్ద పనులు పూర్తి కావస్తున్నాయని, ఉద్దండపూర్ పనులు పూర్తైతే మీ ప్రాంతానికి సాగునీరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో నీటిని ఎత్తిపోసే మోటార్ల సామర్థ్యం 149 మెగావాట్లని పేర్కొన్నారు. కొంతమంది దురుద్దేశంతో కేసులేసి నీళ్లు రాకుండా ప్రాజెక్టు ఆపాలని చూసిండ్రని, ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే అంచనాలు రెండింతలు పెరుగుతాయని.. ప్రజలపైనే భారం పడుతుందన్నారు.
కేంద్రమే తాండూరు కందిపప్పునకు గుర్తింపునిచ్చింది
మరోవైపు తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు రావడం రైతుల విజయమని మంత్రి కొనియాడారు. భౌగోళిక గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండింగ్ ఉండడంతోపాటు డిమాండ్ ఏర్పడుతుందన్నారు. తెలంగాణ గొప్పదనాన్ని, తాండూరు కందిపప్పు ప్రతిష్టను కేంద్రం గుర్తించిందన్నారు. తాండూరు ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాల్లో ఉన్న అట్టపులిగేట్ అనే పోషకంతో తాండూరు కందిపప్పునకు పోషకాలను పెంచడంతోపాటు రుచిని పెంచి వన్నె తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే తాండూరు కందిపప్పునకు గుర్తింపునిచ్చిందన్నారు. తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు అంశం పాఠ్యాంశంగా చేర్చడంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతర్జాతీయంగా జియో ట్యాగింగ్ పొందిన 16వది తాండూరు కందిపప్పు అని పేర్కొన్నారు.
గూగుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి
తాండూరు కందిపప్పునకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు దక్కడం సంతోషకరమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తేనే రైతు సంతోషంగా ఉంటాడని పేర్కొన్నారు. కందిపప్పునకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించాలంటే గూగూల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కంది బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలి
తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేసేందుకు మంత్రి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కోరారు. మంత్రి కృషితో తాండూరులో 30 ఎకరాల్లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణం చేయనున్నామని తెలిపారు. మార్కెట్ నిర్మాణానికి మొదటి విడుతగా రూ.10 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పీఏసీఎస్ గోదాముల నిర్మాణానికి నాబార్డు సహాయంతో రూ.2 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. తాండూరు మండలంలో ఉల్లిపంట ఎక్కువగా సాగు ఎక్కువగా చేస్తారని, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు మంత్రి హామీ ఇవ్వాలని కోరగా.. త్వరలోనే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు యత్నిస్తామని మంత్రి పేర్కొనారు. తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. రైతును రాజుగా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరగా ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేలా మంత్రి కృషి చేయాలని కోరారు. కందిపప్పునకు జీఐ గుర్తింపు తీసుకువచ్చేందుకు తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సుధాకర్ ఎంతో కృషి చేశారని అభినందించారు.
25 ఏండ్లుగా రైతులకు శిక్షణ
25 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధన సంస్థ వివిధ రకాల పంటలపై రైతులకు శిక్షణనిస్తున్నదని ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తెలిపారు. తాండూరు ప్రాంతంలో కందితోపాటు పలు రకాల పంటలు వర్షాధార పంటలుగా రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరమైన విషయమని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు దేశంలో ఎక్కడాలేని పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
1.48 లక్షల ఎకరాల్లో కంది సాగు
తాండూరు ప్రాంతంలో 1.48 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారని కలెక్టర్ నిఖిల తెలిపారు. కందిపప్పునకు 14 డిసెంబర్ 2022న భౌగోళిక గుర్తింపు లభించిందన్నారు. తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు రావడంలో కృషి చేసిన రైతులు, శాస్త్రవేత్తలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
రైతు కష్టానికి గుర్తింపు
రైతు పడ్డ కష్టానికిగాను కంది పంటకు జీఐ గుర్తింపు రావడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి అన్నారు. డీసీసీబీ బ్యాంకు బలోపేతానికి మంత్రి నిరంజన్రెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రీ డిప్యూటీ డైరెక్టర్ హబీబుల్లా, శాస్త్రవేత్తలు సుధాకర్, సుధారాణి, ఎంపీపీ బాలేశ్వరగుప్తా, మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ జీవరత్నం, బీఆర్ఎస్ నాయకులు శకుంతల, ఉమాశంకర్, సాయిరెడ్డి పాల్గొన్నారు.
దౌలాపూర్లో పీఏసీఎస్ గోదాం, రైస్మిల్ శంకుస్థాపన
యాలాల : యాలాల మండలం దౌలాపూర్లో రూ.2కోట్ల50 లక్షలతో నిర్మిస్తున్న పీఏసీఎస్ గోదాం, రైస్మిల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వ్యవసాయం ఒక గౌరవప్రదమైన వృత్తన్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు ప్రతి రైతూ అడుగులు వేయాలన్నారు. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, ముత్యాలు, నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్, గుంటూరు మిర్చి ఎంత ప్రఖ్యాతి చెందాయో అదే తరహాలో తాండూరు కందిపప్పు కూడా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిందన్నారు.
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
తాండూరు రూరల్ : రైతు వేదికలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వ్యవసాయాధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఓ క్లస్టర్లో ఎంత మంది రైతులు ఉన్నారు? ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తున్నారు. ఎంత మంది మహిళా రైతులు ఉన్నారంటూ ఏఈవో శివకుమార్ను మంత్రి ప్రశ్నించారు. అనంతరం అధికారులతో ఎప్పడు ఉద్యోగంలో చేరారు.. తదితర అంశాలపై కుశల ప్రశ్నలు వేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనే వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ మంత్రికి వివరించారు. పాలమూరు – రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తే జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందని గోపాల్ పేర్కొన్నారు.