కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఓపెన్ టూ ఆల్ టోర్నమెంటు శుక్రవారం రాత్రి ముగిశాయి. గ్రామీణ స్థాయిలో 36జట్లు, ఓపెన్ స్థాయిలో 7జట్లు పాల్గొనగా క్రీడలు పీడీల, గ్రామ సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ జ్యోతిల ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, ఉద్యోగుల సహకారంతో స్వర్గీయ బీపిన్ రావత్ స్మారకార్థం ఈ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి హాజరై గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు.
దేశానికి సేవలు అందించి స్వర్గీయులైన బీపిన్ రావత్ పేరుమీదు వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ భీంరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్, నాయకులు బీఎస్ ఆంజనేయులు, తిరుపతి, రాములు, మైపాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలు వీరే…
బండవెల్కిచర్ల గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో ఓపెన్ టూ ఆల్ విజేతలుగా నిలిచారు. ముంబాయి జట్టుకు ప్రథమ బహుమతి, మంగుళూరు జట్టుకు ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి బీదర్ జట్టు గెలుచుకున్నాయి.