ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 23 : నూతన సంవత్సర వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్, వైన్ షాప్, ఈవెంట్ నిర్వాహకులతో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్, ఎస్వోటీ, షీటీమ్స్, పెట్రోలింగ్ వంటి బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అవుట్ డోర్ ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేడుకలలో డ్రగ్స్ వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల నిఘా కట్టుదిట్టంగా ఉందని, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. నిర్ణీత సమయానికి వైన్స్లు మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే ఆయా దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల పార్కింగ్కు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విస్తృతంగా ఉంటాయని, నిర్లక్ష్యంగా, అత్యంత వేగంగా వాహనాలు నడుపొద్దన్నారు, తాత్కాలికంగా ైప్లెఓవర్లు మూసేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, శ్రీనివాస్, సాయిశ్రీ, జానకి, ఇందిరా గిరిధర్, మురళీధర్ పాల్గొన్నారు.