కొడంగల్, జనవరి 12 : మున్సిపల్ అభివృద్ధిపై ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక మహిళా సమాఖ్య భవనంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, పట్టణ పురప్రముఖులు, ప్రజలతో సమావేశాన్ని నిర్వహించి మున్సిపల్ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డిలతో పాటు ఆయా పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పలు అంశాలను ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకొచ్చారు.
విద్య, వైద్యం, రవాణా, అంతర్గత రోడ్లు, మురుగు కాలువ నిర్మాణం, పార్కులు, ఆటస్థలాలు ప్రధాన కూడళ్ల విస్తరణ వంటి విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కడా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు. ప్రజలు కోరుకునే వాటి కంటే అధికంగా అభివృద్ధి జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కటకం శివకుమార్, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఎండీ యూసూఫ్, బీజేపీ నాయకుడు పున్నం చంద్లాహొటీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, సీపీఐ నాయకుడు ఇందనూర్ బషీర్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.