షాబాద్, ఫిబ్రవరి 23 : ఇంటి పన్ను వసూళ్లను వంద శాతం పూర్తి చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని పురపాలక శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న నిధులతో ఊర్లు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. దీంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంటి పన్నును చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో రూ.40 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు రూ. 30 (75 శాతం) కోట్లు వసూలు చేశారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు.
గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం నెలనెలా గ్రామపంచాయతీలకు పెద్దఎత్తున నిధులు అందిస్తున్నది. మౌలిక వసతుల కల్పనతోపాటు పచ్చదనం, పారిశుధ్యం, ఇంటింటికి తాగునీటిని ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్నది. వాటి ప్రయోజనాలను పొందుతున్న ప్రజల ఆలోచనలోనూ మార్పు మొదలైంది. సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 75 శాతం ఇంటి పన్నులు వసూలయ్యాయి. ఈ ఏడాది మార్చి 31 వరకు సమయం ఉండడంతో వంద శాతం లక్ష్యం చేరుకునేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులకు ప్రజలు పన్నుల రూపేణా చెల్లిస్తున్న ఆదాయం తోడవడంతో గ్రామపంచాయతీల్లో నిధులు జమవుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు సైతం సాఫీగా సాగుతుండడంతో పల్లెలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నాయి.
75 శాతం పన్నులు వసూలు
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 558 గ్రామపంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 75 శాతం ఇంటి పన్నులు వసూలు చేసినట్లు సంబంధిత పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ.40 కోట్లు ఉండగా.. ఇప్పటివరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోపు లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నిత్యం పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూలు చేపడుతున్నారు. పన్నులు వసూళ్లలో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పన్నులు వసూలు చేస్తున్నారు.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 36 రోజులు మిగిలి ఉంది. అంతలోపు వంద శాతం లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. రోజువారీ పన్నుల వసూళ్ల నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
మార్చి నాటికి వంద శాతం పూర్తి చేస్తాం
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నుల వసూలు వేగవంతంగా జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.40 కోట్లు పన్నుల వసూలు లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.30 కోట్లు వసూలు చేశాం. పన్నులు వసూలు చేయడంలో సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోగా పూర్తి లక్ష్యాన్ని చేరుకునేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నాం.