యాచారం, జనవరి 21 : మండలంలోని నందివనపర్తి జ్ఞాన సరస్వతీ ఆలయానికి అనతి కాలంలోనే ఊహించని ఆదరణ వచ్చినది. గతంలో 108 పాఠశాలలకు 108 ఏకశిల సరస్వతీ విగ్రహాలను పంపిణీ చేయడంతో ఆలయ ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం నిర్మించిన ఈ ఆలయం ఉత్సవాలకు ముస్తాబు అయింది. చదువుల తల్లి సరస్వతీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏడాది వసంత పంచమికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 22 నుంచి 30 వరకు శ్యామలా నవరాత్రి ఉత్సవాలు, 26న వసంత పంచమి మహోత్సవం నిర్వహించనున్నారు. హం పి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామిజీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, సరస్వతీ హోమం నిర్వహించడంతో పాటు, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఇందుకోసం బాసర వెళ్లలేని భక్తులు నందివనపర్తిలో అక్షరాభ్యాసం చేయించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
విరాళాలతో గుడి నిర్మాణం..
ఆలయ నిర్మాణం కోసం జ్ఞానసరస్వతీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల భాగస్వామ్యంతో విరాళాలు సేకరించారు. మండలంతో పాటు పక్క మండలంలోని పాఠశాలల విద్యార్థులు రెండు వేల మంది విరాళాలు సేకరించారు. ఈ విరాళాలతోనే ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. జ్ఞానసరస్వతీ అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కళాశాలల విద్యార్థులతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. పదో తరగతి విద్యార్థులు సేకరించిన విరాళాలతో అమ్మవారికి ఆభరణాలు చేయించారు.
ప్రత్యేక పూజలు.. అర్చనలు
ఆలయంలో అమ్మవారికి నిత్య దీప, ధూప, నైవేద్య కార్యక్రమాలతో పాటు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, సహస్ర కుంకుమార్చనలను పురోహితులు రాఘవేంద్రశర్మ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మండలంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
ముమ్మర ఏర్పాట్లు
జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఈనెల 22నుంచి 30వరకు శ్యామలా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. జాన సరస్వతీ సేవా సమితి వ్యవస్థాపకుడు సదావెంకట్రెడ్డి సమక్షంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ ఉత్సవాలను హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామిజీ ప్రారంభించనున్నారు.
కార్యక్రమాలు ఇలా..