షాద్నగర్ : నేటి తరం యువకులు ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో యువజ విభాగం శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రాంతాల్లో యూత్ క్లబ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండ యువతకు మార్గనిర్ధేశం చేసేలా క్లబ్లు పని చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు యువకలు సేవా రంగాల్లో రాణించాలని చెప్పారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా యువతి, యువకుల్లో నైపుణ్యం పెంచేలా శిక్షణ తరగతులను నిర్వహించాలన్నారు. శారీరక వ్యాయమంలో భాగంగా అనువైన చోట 2కె, 5కె రన్ , క్రీడలు, పరుగు పందెం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. రక్తదానం, అవయవదానం, వైద్య శిబిరాల్లో యువకులు ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలన్నారు. స్వచ్ఛతాహి సేవా 2021లో భాగంగా శ్రమదానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధికారి ఐసయ్య, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, క్రీడ విభాగం జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, సంక్షేమ శాఖ అధికారిని మోతి, రెడ్క్రాస్ ప్రతినిధి నర్సింహరెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.