షాద్నగర్టౌన్, నవంబర్ 25 : తల్లిపాలే నవజాత శిశువుకు శ్రేయస్కరమని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి అన్నారు. నవజాత శిశువు సంరక్షణ వారోత్సవాల్లో పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం నవజాత శిశువుల సంరక్షణపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన కొద్ది సమయానికి ముర్రుపాలు పట్టించాలన్నారు. తల్లిపాలతో శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి తల్లి తమ శిశువులకు 6నెలల పాటు తల్లిపాలను మాత్రమే పట్టించాలన్నారు.
శిశువులకు క్రమం తప్పకుండా టీకాలను వేయించాలని, టీకాలు వేయించడం ద్వారా చిన్నారులు భవిష్యత్లో ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఉంటారన్నారు. ప్రతి నెల చిన్నారులు బరువు పెరుగుతున్నారా లేదా అని గమనించాలన్నారు. నవజాత శిశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అదే విధంగా గర్భిణులు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. నవజాత శిశువుల సంరక్షణ గురించి తల్లులకు వివరించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్ వైద్యాధికారి వరదాచారి, శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ఫార్మాసిస్టు ఉదయ్కుమార్, హెల్త్ సూపర్వైజర్లు మెర్లిన్, అమృత, ఆశాలు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.