ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 25 : అరచేతిలో సమాచార విప్లవంతో ప్రపంచం చేతికి వచ్చింది.. అనేక సేవలు సులభతరం అయ్యాయి. ఈ కోవలో ప్రజలకు పౌరసేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆధునిక సమాచార ప్రపంచంలో ప్రతిపల్లె.. ప్రతి ఇల్లు.. ప్రతి వ్యక్తి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చి చేరింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లలో ఇంటర్నెట్తో ఇంటి నుంచే అనేక సేవలు పొందేందుకు అవకాశం ఏర్పడింది. వీటిపై ఎక్కువశాతం మంది ప్రజలకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతి చిన్నపనికి మీ సేవలు, సర్వీస్సెంటర్లను, దళారులను ఆశ్రయించి వాళ్లు అడిగినంత డబ్బులు చెల్తిసున్నారు. కొంచెం అవగాహన పెంచుకుంటే ఇంటి వద్ద నుంచే అనేక సేవలను సులభంగా పొందవచ్చు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంటినుంచే మనకు కావాల్సిన ప్రతి విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకునే అవకాశముంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల పథకాలు స్మార్ట్ఫోన్, కంప్యూటర్ ద్వారా ఇంట్లో కూర్చుని రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఇలా..
మీసేవ కేంద్రాల్లో చేసుకునే ప్రతి దరఖాస్తును ఇంట్లో కూర్చుని ఎలాంటి ఇబ్బంది లేకండా చేసుకోవచ్చు. ఇందుకు (టీఎస్ మీసేవ) అని గూగుల్లో సెర్చ్చేసి ముందగా సిటిజన్ లాగిన్ పొందితే సరిపోతుంది. సిటిజన్ లాగిన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం ఫోన్నంబర్, ఈ మెయిల్ అడ్రస్ సరిపోతుంది. కుల, ఆదాయ నివాస సర్టిఫికెట్ల నుంచి ప్రతీది ఇంటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం పొందిన రసీదు నంబర్తో మీసేవ కేంద్రాలకు వెళితే రూ. 5 నుంచి రూ.15వరకు పేపర్ చార్జీలను తీసుకుని సర్టిఫికెట్ను ప్రింట్తీసి ఇస్తారు. దీంతో డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చును.
పైసా ఖర్చులేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్..
మన ఇంటి నుంచే ఆన్లైన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కల్యాణలక్ష్మి పోర్టల్ ద్వారా పూర్తి ఉచితంగా ఎలాంటి రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు చేయడానికి ఉపయోగించిన ఒరిజినల్ కాగితాలు, ఒకసెట్టు జిరాక్స్ కాపీలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. కాగా, చాలామందికి వీటిపై అవగాహన లేక సేవలకు ఇంటర్నెట్ కేంద్రాల్లో అధిక డబ్బులు చెల్లిస్తున్నారు. దీనికి తోడు దళారులు సైతం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.
రూ.107కే పాన్కార్డు..
ప్రస్తుతం ఆధార్కార్డుతో పాటు పాన్కార్డు తప్పనిసరిగా మారింది. కాగా, పాన్కార్డును పర్సన్ కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ ద్వారా ఆధార్కార్డు నంబర్, వివరాలను అందిస్తే పదిరోజుల్లో పాన్కార్డు ఇంటికి వస్తున్నది. అత్యవసరంగా కావాలంటే ఆధార్కార్డుకు కేవైసీ ఉంటే గంటలోనే మీ ఈమెయిల్ ఐడీకి పాన్కార్డు జిరాక్స్ వస్తుంది. దీనికోసం రూ.107 యూపీఐ, బ్యాంక్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు రూ.150నుంచి రూ.250పైగా అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేక దళారులను ఆశ్రయించి పూర్తిగా మోసపోతున్నారు.
ధరణి పోర్టల్తో నిమిషాల్లో స్లాట్ బుకింగ్..
సామాన్యులకు సైతం సులభంగా రెవెన్యూ సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తెచ్చింది. ధరణీ పోర్టల్ ద్వారా ప్రభుత్తం పారదర్శకంగా రెవెన్యూ సేవలను అందిస్తున్నది. ఇందుకోసం ధరణి సేవలను మరింత మెరుగుపర్చింది. ధరణీ పోర్టల్ ద్వారా ఉచితంగా భూ వివరాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సిటిజన్ లాగిన్ ద్వారా హాయిగా ఇంట్లోనే కూర్చుని ధరణి స్లాట్బుక్ చేసుకోవచ్చును. ముందుగా ధరణి పోర్టల్లో సిటిజన్ లాగిన్ చేసుకుని భూక్రయవిక్రయాల వివరాలను పొందుపర్చి, సర్వీస్ట్యాక్స్ను యూపీఐ లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా సేవలను సులభతరంగా పొందవచ్చును.
క్షణాల్లో ఆధార్కార్డు ..
మీ ఆధార్కార్డుకు మొబైల్ నంబర్ అనుసందానం ఉంటే క్షణాల్లో ఆధార్కార్డును ఎక్కడికైనా మీ స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి యూఐడీఏఐ పోర్టల్లో ఎలాంటి రుసుము లేకండా ఉచితంగా ఆధార్కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త పీవీసీ ఆధార్కార్డు కావాలంటే మాత్రం రూ.50 రుసుం చెల్లిస్తే నెలరోజుల్లో పీవీసీ కార్డుపై ప్రింట్ చేసిన ఆధార్కార్డు మీ ఇంటికి వస్తుంది.