పెద్దశంకరంపేట, ఏప్రిల్ 08: శ్రీరామ నవమి ఉత్సవాలను (Sri Rama Navami) పురస్కరించుకొని పెద్దశంకరంపేటలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువ జామున వరకు శ్రీ సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా, రమణీయంగా నిర్వహించారు. రథం ముందు వేదబ్రాహ్మణులచే హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల, లక్ష్మణ విగ్రహాలను రథంపై ఉంచి పట్టణ పురవీధులగుండా రథాన్ని ఊరేగించారు. రథంను కాషాయ జెండాలతో, రకరకాల పూలతో పాటు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.
యువకులు, పెద్దలు జైశ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ స్థానిక రామాలయం నుంచి పట్టణ పురవీధులగుండా భవానీ మాత ఆలయ కమాన్ వరకు రథాన్ని ఊరేగించారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జరి కనకరాజు, కందుకూరి రవిందర్, ఆలయ కమిటీ సభ్యులు జంగం శ్రీనివాస్, సుభాశ్గౌడ్, రాగం సిద్దు, శ్రీను, ఆర్ఎస్ సంతోష్, అన్నారం సత్యనారాయణ, గంగారెడ్డి, ఆర్ఎన్ సంతోష్ కుమార్, గ్రామ పెద్దలు, ఆయా కులసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.