సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : వచ్చే వర్షాకాలంలో వరద ముంపు నివారణకు జోన్లవారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఈఎన్సీ జియావుద్దీన్తో కలిసి మాన్సూన్ ప్రిపరేషన్పై దానకిశోర్ సమీక్షించారు.
జీహెచ్ఎంసీ ఏరియాలో వర్షాకాలంలో ముంపునకు గురయ్యే కాలనీల వివరాలు, ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు, అవసరమైన నిధులను జోన్ల వారీగా సిద్ధం చేయాలన్నారు. మ్యాన్హోళ్లు, క్యాచ్ఫిట్ ఏరియా ల్లో వరదలతో ప్రమాదాలు జరుగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, వానకాలం రాకముందే నాలాల పూడికతీత పనులను పూర్తి చేయాలన్నారు. జీహెచ్ఎంసీకి చుట్టూ పక్కల ఉన్న మున్సిపాలిటీల్లో నూ ఎస్ఎన్డీపీ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రెండో దశ ఎస్ఎన్డీపీ పనులను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని ఈఎన్సీని దానకిశోర్ ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్ మేజర్ 101, మీడియం 127, మైనర్ 92 కాగా, ఈ పాయింట్ల రోడ్మ్యాప్ గుర్తించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పనికిరాని బోర్వెల్స్ను గుర్తించాలని, ప్రమాదాలు సంభవించకుండా సైన్బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. స్మార్ట్ వాటర్ నాలాలో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులతోపాటు మెష్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు పాల్గొన్నారు.