తాండూరు, ఆగస్టు 18 : రాజకీయ, ఆర్థిక సాంఘిక సమానత్వం కోసం పోరాడారు మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం, వివిధ పార్టీల నాయకులు పాపన్నగౌడ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు ఆయన సేవలను కొనియాడారు. 17వ శతాబ్దంలోనే బడుగుల రాజ్యాధికారం కోసం పోరాడిన మహనీయుడు పాపన్న అని, గ్రామాల్లో పాలకులు ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తుంటే ప్రత్యేక ప్రణాళికలు చేపట్టి పాలకులకు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. గెరిల్లా పోరాటంతో వరంగల్ కోటను జయించిన వీరుడు పాపన్నగౌడ్ అని అన్నారు. బహుజనుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన పాపన్నగౌడ్ ఆదర్శప్రాయుడని, ఆయన సేవలు చిరస్మరనీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా పలుచోట్ల విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు.
సాధారణ గీత కుటుంబంలో జన్మించి దొరలు, జాగిర్ల నుంచి మొగల్ రాజులను గడగడలాడించి తెలంగాణ పౌరుషాన్ని తెలిపిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలు శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని వినాయకచౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడసంఘం, బీసీ సంఘాలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీచౌక్లోని శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్టు భవనంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ యువకులతో కలిసి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శుభప్రద్పటేల్ మాట్లాడుతూ గ్రామాల్లో పాలకులు ఇష్టారాజ్యంగా పన్నులు వేసి చెల్లించనివారిని ఇబ్బందులు పెడుతుంటే సర్వాయి పాపన్న ప్రత్యేక ప్రణాళికలు చేపట్టి పాలకులకు బుద్ధి చెప్పారన్నారు. కులమతాలకు అతీతంగా పాపన్న ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహనీయుల జయంతి, వర్ధ్దంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజ్కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీకి సమకాళికుడని తెలిపారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినవారిని అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, గౌడ సంఘం ప్రతినిధులు, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గెరిల్లా పోరాటంతో వరంగల్ కోటను జయించిన మహనీయుడు పాపన్నగౌడ్ అని కొనియాడారు. తెలంగాణలో కల్లుగీత వృత్తి కనుమరుగైనందున ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతున్న గీత పని వారిని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇస్తున్నారని, కార్మికులు చనిపోతే కుటుంబాలను ఆదుకోవడానికి రూ.6 లక్షల బీమా సాయం అందజేస్తున్నామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో అన్ని కులాల వారికి భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు ఇచ్చామని, త్వరలో గౌడ్ కులస్తులకు ఎకరా భూమి ఇచ్చి భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని మరో రెండు చోట్ల ఏడాదిలోపు పాపన్నగౌడ్ విగ్రహాలను నెలకొల్పుతామని ఎమ్మెల్యే చెప్పారు. గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఛత్రపతి శివాజీలా ఎంతో పరాక్రమమైన వ్యక్తి అని, నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రావణ్గౌడ్, సర్పంచ్ స్వరూప, ఎంపీటీసీ తిరుపతయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, తాలలూకా యూత్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు శ్యామలయ్యగౌడ్, అశోక్గౌడ్, మల్లేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్ణాలను ఏకం చేసి పోరాడిన వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. పాపన్న గౌడ్ కల్లుగీత వృత్తిని కొసాగిస్తూనే భూస్వాములు, దేశ్ ముఖ్లు కొనసాగిస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా, మొగలు సామ్రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. మూడు వందల ఏండ్ల కిందే బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశారన్నారు. చేవెళ్లలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. వృత్తులు కులాలుగా మారాయని మనం అంత ఒకటేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, రాజలక్ష్మీప్రకాశ్గౌడ్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, ఎంపీటీసీలు సున్నపు వసంతం, రాములు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కృష్ణ, వెంకటేశ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.