రెండేండ్ల కింద తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమైన తాండూరు పట్టణవాసులకు ఉపశమనం లభిస్తున్నది. ఢిల్లీ కంటే రెట్టింపు స్థాయిలో కాలుష్యమున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదికల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలతో రికార్డు స్థాయిలో 600-650 మైక్రో గ్రాములు ఉన్న కాలుష్యం… ప్రస్తుతం 300-350 మైక్రో గ్రాములకు తగ్గింది. తాండూరు చుట్టు పక్కల నాపరాతి, సిమెంట్ పరిశ్రమలు ఉండడం వల్ల రోజుకు సుమారు 5 వేల లారీలు వస్తూ పోతుంటాయి. ఈ కాలుష్యానికి కళ్లెం వేసేందుకు తాండూరు నుంచి జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్ వెళ్లే దారిలోని గొట్లపల్లి అంతారం రిజర్వ్ ఫారెస్ట్లోని 45 హెక్టార్లలో పట్టణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అర్బన్ పార్క్లో కాలుష్యం నుంచి విముక్తి కలిగేలా ఔషధ మొక్కలతో పాటు అలంకార మొక్కలను నాటారు. తాండూరు బైపాస్ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి. అందుబాటులోకి రాగానే బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించనుండడంతో తాండూరు పట్టణవాసులకు కాలుష్యం నుంచి పూర్తి విముక్తి కలుగనున్నది. అంతేకాకుండా ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేసి తాండూరు నుంచి నాపరాతి పరిశ్రమలను తరలించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అధికారులు చర్యలు చేపట్టారు.
– వికారాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న తాండూరు పట్టణ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. రెండేండ్ల క్రితం ఢిల్లీకి మించి తాండూరులో వాయుకాలుష్యం నమోదుకాగా.. ప్రస్తుతం సగం మేర కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి తాండూరు వాసులకు వాయు కాలుష్యం నుంచి పూర్తిగా విముక్తి కలిగించేలా చొరవ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మంజూరైన తాండూరు బైపాస్ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. తాండూరు చుట్టూ పక్కల గల మైనింగ్, సిమెంట్ ఫ్యాక్టరీలతో రోజుకు 5వేల లారీల వరకు తాండూరు మీదుగా వస్తూ పోతుంటాయి. తాండూరు బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చినట్లయితే తాండూరు పట్టణం మీదుగా కాకుండా బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. నాపరాతి పరిశ్రమలను కూడా తరలించేందుకు నాపరాతి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. తాండూరు చుట్టుపక్కల వందల సంఖ్యల్లో ఉన్న నాపరాతి, సిమెంట్ పరిశ్రమలతో వెలువడే అధిక కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం అర్బన్ పార్కును కూడా ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వీలైనంత త్వరితగతిన సంబంధిత పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టి కాలుష్యంలేని తాండూరు పట్టణంగా మార్చేందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక నజర్ పెట్టారు.
300 మైక్రోగ్రాములకు తగ్గిన కాలుష్యం
రెండేండ్ల క్రితం ఢిల్లీ కంటే రెట్టింపు స్థాయిలో తాండూరులో కాలుష్యం ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి నివేదికల్లో స్పష్టం కాగా.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవడంతో కొంతమేర తాండూరులో తగ్గుముఖం పట్టింది. రెండేండ్ల క్రితం 622 మైక్రో గ్రాములుండగా.. ప్రస్తుతం కాలుష్య తీవ్రత 300-350 మైక్రో గ్రాములకు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ స్థాయి 60-100 మైక్రో గ్రాములు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థాయి కంటే అధికంగానే ఉన్న దృష్ట్యా కాలుష్యం తగ్గించేందుకు తగు చర్యలు చేపట్టారు. జాతీయ వాయు ప్రమాణాల సూచిక ప్రకారం సాధారణంగా వాయువులో ఒక క్యూబిక్ మీటర్కు 100 మైక్రో గ్రాముల కాలుష్యం మోతాదు మాత్రమే ఉంటే ప్రజల ఆరోగ్యానికి హాని కలుగదు. తాండూరు పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో కాలుష్యం మోతాదుకు మించి ఉన్నట్లు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ నియమించిన కమిటీ నివేదికలో పేర్కొన్నది.
నాపరాతి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు నిర్ణయం
తాండూరు పట్టణ పరిసరాల్లో 15-20 కిలోమీటర్ల పరిధిలో ఐదు సిమెంట్ కర్మాగారాలు ఉండడంతో పాటు వందల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు, నాపరాళ్ల క్వారీలు, సుద్ద గనులు, ల్యాటరైట్ గనులు ఉండడంతో పట్టణం మీదుగా ప్రతిరోజూ 5 వేల లారీలతోపాటు ఇతర వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సిమెంట్ కర్మాగారాలకు ప్రతిరోజూ బొగ్గు, రాళ్లు, ల్యాటరైట్ను(ఎర్రమట్టిని) చేరవేసే లారీలు వందల సంఖ్యలో తిరుగుతుండడంతో పట్టణంలో కాలుష్యం అధికమవుతున్నట్లు గుర్తించారు. పట్టణానికి చేరువలో రెండు స్టోన్ క్రషర్ యూనిట్లు, నాలుగైదు సుద్ద ఫ్యాక్టరీలు కూడా ఉండడంతో కాలుష్యం మోతాదుకు మించి పెరుగుతున్నది. తాండూరు పట్టణ పరిసరాల్లో దాదాపు 800 పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ పాలిషింగ్ యూనిట్లలో కనీసం 400 లారీల నాపరాళ్లను పాలిష్ చేస్తున్నారు. వీటిని పాలిషింగ్ చేసే ముందు గనుల నుంచి తీసుకువచ్చిన నాపరాళ్ల పలకలను తగిన సైజుల్లో కోత యంత్రాల సహాయంతో కోస్తారు. దీంతో ప్రతి పాలిషింగ్ యూనిట్లో కనీసం రోజుకు 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని నాపరాతి ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. తాండూరులో ఉన్న నాపరాతి పరిశ్రమలన్నింటిని త్వరలోనే ఇండస్ట్రియల్ పార్కుకు తరలించనున్నారు.
45 హెక్టార్లలో అర్బన్ పార్కు
వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాండూరుకు 4 కిలోమీటర్ల సమీపంలో అర్బన్ పార్కును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. తాండూరు నుంచి జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్ వెళ్లే దారిలోని గొట్లపల్లి అంతారం రిజర్వ్ ఫారెస్ట్లోని 45 హెక్టార్లలో పట్టణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత ఉద్యానవనంలో కాలుష్యాన్ని నియంత్రించే ఔషధ, అలంకార తదితర మొక్కలతో ఉద్యానవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది 50 వేల వరకు ఔషధ తరహా మొక్కలను అర్బన్ పార్కులో నాటినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునే పరికరాలు, అడ్వెంచెరల్ ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.4 కోట్లతో పార్కు ఏర్పాటుకు నిర్ణయించగా.. ఇప్పటివరకు రూ.1.55 కోట్ల నిధులు విడుదల కాగా పనులు జరుగుతున్నాయి.