మైలార్దేవ్పల్లి: ప్రభుత్వ దిగువ మథ్య తరగతివారి కడుపు నింపాలన్న లక్ష్యంతో రేషన్ దుకాణాల ద్వారా కిలో రూపాయికే ఇస్తున్న రేషన్ బియ్యాన్ని కార్డు ఓల్డర్లు దళారులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్న బియ్యాన్నిదళారులకు 8 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు.
నిజమైన నిరుపేదలు కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే అన్ని రకాల సంపాదన ఉన్న వారి ఇళ్లలో తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వారికి వచ్చే బియ్యాన్ని తినడానికి వినియోగించుకోకుండా డబ్బులకు అమ్ముకుంటున్నారు. ప్రతి నెల 1 నుంచి 15వరకు రేషన్ షాపులలో వచ్చే బియ్యాన్ని అమ్మడానికి ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా కొనె దళారులు ఇంటిముందుకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
మైలార్దేవ్పల్లి డివిజన్ పద్మశాలి పురం బస్తీలలో సోమవారం దళారులు ఆటో ట్రాలీతో తిరుగుతూ రేషన్ బియ్యం కొనుగోలు చేయడం నమస్తే తెలంగాణ కంటపడింది. దళారులు సైతం ఎలాంటి బెరుకు లేకుండా పట్టపగలే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం గమనార్హం. ఇలా దళారులకు అమ్ముకుంటున్న వారి కార్డులు రద్దుచేసి అర్హులైనవారిని గుర్తించి వారికి రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వారం రోజుల క్రీతం ఎఎస్ ఓ బాలసరోజ ప్రగతి కాలనీలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ 200 క్వింటాళ్ల బియ్యాన్ని కూడా పట్టుకుని సీజ్ చేశారు .ప్రజల నుండే కాకుండా రేషన్ డీలర్ల నుండి కూడా దళారులు బియ్యాన్నికొనుగోలు చేస్తున్నారని సమాచారం .ఈ విషయం అధికారులకు తెలిసి కూడ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని సులేమాన్నగర్ ,శివరాం పల్లి, లక్ష్మిగూడ, వట్టేపల్లి , టాటానగర్ ప్రాంతాల్లొ ఉన్న గోదాములలో నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని తిరిగి మిల్లులో పాలీష్ చేసి సన్నబియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే విక్రయిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో అధికారులు స్పందించి రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.