షాబాద్ : రైతుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పేదోకటి.. చేసేది ఒకటిగా వ్యవహారిస్తుందని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామ పూరవీధుల గుండా ఊరేగించారు. అనంతరం ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ప్రభుత్వంపై లేనిపోని అబద్దాలు చెబుతుందని మండిపడ్డారు.
ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేసిన బీజేపీ కళ్లు తెరవడం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం జరిగేంతా వరకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారమున్నా రైతులకు పంటలు పండించేందుకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందన్నారు. త్వరలో యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. రైతుబీమా ద్వారా రూ. 5లక్షలు అందించి ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతుల కోసం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేంతా వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని మహేందర్రెడ్డి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ భానూరి మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ పోన్న స్వప్నానర్సింహారెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, టీఏల్ఏఫ్ జిల్లా లీగల్ అడ్వైజర్ పీసరి సతీశ్రెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు తొంట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.