షాబాద్ : పోషకాహార లోపరహిత సమాజాన్ని తయారు చేయాలని, అందుకు గాను స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా సంక్షేమాధికారి మోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీడీపీవోలు, సూపర్వైజర్లు గ్రామాల్లో అతితీవ్ర లోప పోషణ, తీవ్ర లోపోషణ, తక్కువ బరువు ఉన్న పిల్లల జాబితా తీసుకుని వారందరిని నార్మల్ స్టేజ్లోకి తీసుకురావటానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లోకి వెళ్లి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సూపర్వైజర్లు, సీడీపీవోలు ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తూ లోపాలను సరిదిద్ది ఏ ఒక్క శిశువు కూడా మాల్ న్యూట్రిషన్ లేకుండా చేయాలని సూచించారు. అవసరమైతే స్థానిక సర్పంచులు, సెక్రటరీలు, మండల అధికారుల సహాయ సహాకారాలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి శిశువు వివరాలు తప్పనిసరిగా ప్రతి సర్పంచ్ దగ్గర ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రాజెక్టుల వారీగా గ్రోత్ మానిటరింగ్, అండర్ వేట్, స్టండింగ్, వేస్టింగ్ మీద ఎంత మంది ఉన్నారు…? ఉండటానికి గల కారణాలను తెలుసుకుని వాటి నివారణకు పరిష్కార మార్గాలను చూపాలని జిల్లా సంక్షేమాధికారి మోతికి సూచించారు.
పోషన్ అభియాన్ గైడ్లైన్ ప్రకారం నడుచుకోవాలన్నారు. అనాథ, పాక్షిక అనాథ పిల్లల విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవాలని, వారిని మన పిల్లలుగా భావించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల సీడీపీవోలు, బాలల సంరక్షణ అధికారులు హర్షవర్దిని, ప్రవీణ్కుమార్, సూపర్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.