బషీరాబాద్ : ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం, బాలుర ఉన్నత పాఠశాలతో పాటు, కస్తూర్బాగాంధీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సమయానికి పాఠశాలలకు హాజరుకాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే జీతంలో కోత విధిస్తామన్నారు. రావడానికి ఆలస్యమైతే స్థానికంగానే ఉండి పాఠశాలకు హాజరుకావాలన్నారు.
పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి లేదంటే అట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారి సుధాకర్రెడ్డికి సూచించారు. ఉపాధ్యాయులు అనుమతి లేనిదే విధులకు గైర్హాజరైతే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి విద్యార్థి కొవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు ఉన్న తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు గణితంకు సంబంధించిన లెక్కలకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులకు మాస్కులు ధరిస్తూ, శానిటేషన్ చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. పాఠశాలలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు డీఈవో ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు తీరు సక్రమంగా లేదని తెలిపారు.
అందుకు స్పందిస్తూ జిల్లాలో 16 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉన్నాయని ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేరని, బషీరాబాద్ ఉర్దూ మీడియంలో ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని వారు కూడా తెలుగు మీడియానికి సంబంధించిన వారని, తాండూరు ఉర్దూ మీడియం పాఠశాల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధం కావడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చూసేందుకు వచ్చినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభం విషయం విద్యార్థులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సుధాకర్రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.