కొడంగల్ : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్లే రైతులకు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని విధంగా వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతుబంధుకు ఎటువంటి డోఖలేదని, రైతులను కేసీఆర్ నుంచి వేరు చేయాలనే కుట్రతో ప్రతిపక్షాలు రైతుబంధుపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. రైతులు ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలోని రైతు అభివృద్ధిని ఓర్వలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకు రైతులను కేసీఆర్ నుంచి విడదీయాలనే దురుద్ధేషంతో యాసంగి వడ్ల కొనుగోలుపై కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. వానాకాలంలో పండిన వరి పంటను ఇంకా కేంద్రం 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందుకు గాను టీఆర్ఎస్ మంత్రి బృందం ఢీల్లీకి వెళ్లినట్లు తెలిపారు. వానాకాలం పంటను కొనడంలోనే మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యాసంగి పంటలను కొంటుందనే నమ్మకం లేదని స్పష్టం చేశారు. కాబట్టి రైతులు యాసంగిలో వరి ధాన్యం సాగు చేసే కన్న ఇతర పంటల సాగు చేయాలని తెలిపారు.
బీజేపీ పార్టీ కేంద్ర నాయకులు యాసంగి వడ్లను కొనుగోలు చేయమని చెపుతుంటే.. రాష్ట్రంలోని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వడ్లను కొంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండి సంజయ్కి రైతుల పట్ల మాట్లాడే అర్హత లేదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రైతుల కోసం ఏ ముఖ్యమంత్రులు ధర్నా చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని, కానీ రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేసినట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, యాసంగిలో వరి పంటను పండించి ఇబ్బందుల గురి కావద్దని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్పేట పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్, తదితరులు పాల్గొన్నారు.